ఆత్మనిర్భర్ భారత్ 3.0: దేశీయ వ్యాక్సిన్ కోసం ప్యాకేజీ: సురక్షా మిషన్..ఆర్అండ్డీ: నిర్మలమ్మ
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను రూపుమాపడానికి అవసరమైన వ్యాక్సిన్ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దేశీయంగా ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కోవిడ్ సురక్షా మిషన్ కింద ఈ మొత్తాన్ని కేటాయించింది. కోవిడ్ సురక్షా మిషన్ను కేంద్ర బయో టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. ఈ శాఖకు ప్రత్యకంగా ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
Recommended Video
కోవిడ్ సురక్షా మిషన్ను సమర్థవంతంగా అమలు చేయడానికి 900 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశీయంగా కరోనా వ్యాక్సిన్పై పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వాటిని మరింత వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా.. 900 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నామని అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద మరోాసారి ఆమె వివిధ రంగాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దీని విలువ 2.65 లక్షల కోట్ల రూపాయలు. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఈ మొత్తం వాటా 15 శాతంగా నమోదైంది. ఈ ప్యాకేజీ వివరాలను వెల్లడించడానికి నిర్మలా సీతారామన్.. తన శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్తో కలిసి దేశ రాజధానిలో విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పలు ప్యాకేజీలు, ప్రోత్సాహకాలను ప్రకటించారు.
కరోనా వైరస్ వల్ల అమలు చేసిన లాక్డౌన్ పరిస్థితుల వల్ల ఒడిదుడుకులకు లోనైన ఆర్థికరంగం కుదుటపడిందని అన్నారు. రిజర్వుబ్యాంకు అంచనాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి అభివృద్ధి రేటు మరింత మెరుగుపడుతుందని వెల్లడించారు. కరోనా వైరస్ను తరిమికొట్టడానికి అవసరమైన వ్యాక్సిన్ను రూపొందించడానికి దేశీయ సంస్థలు కృషి చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
వ్యాక్సిన్ పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడానికి బయో టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా కోవిడ్ సురక్షా మిషన్ను ఏర్పాటు చేశామని చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ది పనులను ఈ మిషన్ పరిధిలోకి తీసుకొచ్చామని అన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి కార్యక్రమాలు సంతృప్తికర ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాలకు మరింత ఊతం ఇచ్చేలా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించామని తెలిపారు. 900 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేసినట్లు చెప్పారు. వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనేది ఖచ్చితంగా చెప్పలేమని, వివిధ దశల్లో ట్రయల్స్ కొనసాగుతున్నాయని అన్నారు.