షాకింగ్: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికలకు శిరోమణి అకాలీదళ్ దూరం
ఢిల్లీ: రాజ్యసభ ఉపసభాపతి పోరు రక్తి కడుతోంది. ఎన్డీఏ కూటమిలోని కొన్ని పార్టీలే బీజేపీకి హ్యాండ్ ఇచ్చేలా కనబడుతున్నాయి. దీంతో కమలం పార్టీకి తిప్పలు తప్పేలా లేవు. తాజాగా బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ బాదల్ నివాసంలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శిరోమణి అకాలీదళ్ పార్టీకి రాజ్యసభలో ముగ్గురు సభ్యుల బలం ఉంది. ఇందులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ రేసులో ఉన్న నరేష్ గుజ్రాల్ కూడా ఉన్నారు. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం తక్కువగా ఉంది.
ఇదిలా ఉంటే ఆగష్టు 9న ఉదయం 11 గంటలకు రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని సోమవారం పెద్దల సభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అంతేకాదు డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని చెప్పారు. అదేసమయంలో అందరూ ఏకభిప్రాయంతో ఉండి డిప్యూటీ ఛైర్మెన్ను ఎన్నుకోవాలని వెంకయ్య సలహా ఇచ్చారు. నామినేషన్స్ సమర్పించేందుకు చివరి తేదిగా ఆగష్టు 8గా నిర్ణయించారు.
రాజ్యసభ ఉపసభాపతి పీజే కురియన్ పదవీకాలం ముగియడంతో ఎన్డీఏ అభ్యర్థిని రంగంలోకి దించి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని కమలదళం పెద్దలు పావులు కదుపుతున్నారు. సభలో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఎన్డీఏ తరపున మిత్రపక్షానికి చెందిన శిరోమణి అకాలీదళ్ నేత నరేష్ గుజ్రాల్ కానీ జేడీయూకి చెందిన హరివంశ్ను నిలబెడితే ఇతర పార్టీల మద్దతు కూడా ఉంటుందనే వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోంది. ఇదిలా ఉంటే రాజ్యసభ ఉపసభాపతి రేసులో జేడీయూ అభ్యర్థి హరివంశ్ను నిలబెడుతున్నామని ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాల్సిందిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్కు ఫోన్ చేశారు. అయితే తమ పార్టీలో చర్చించుకున్న తర్వాతే చెబుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.