ఎంపీల జీతాల్లో కోత బిల్లుకు రాజ్యసభ ఆమోదం: ఎంపీల్యాడ్స్కు డిమాండ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక అవసరాల కోసం ఎంపీల జీతాల్లో కోతకు సంబంధించిన బిల్లుకు శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. గత సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగా.. మంగళవారం దీనికి సభ ఆమోదం లభించింది. పాత కొత్త బిల్లులను శుక్రవారం పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది.
తాజా బిల్లుల ఆమోదంతో సంవత్సరంపాటు కేంద్రమంత్రులు, ఎంపీలు జీతాల్లో 30 శాతం పడనుంది. ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు స్వచ్ఛందంగా తమ జీతాల కోతకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, వేతనాల కోతకు సంబంధించిన బిల్లులను రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ వ్యతిరేకించారు. ఎంపీల్లో చాలా మంది జీతం మీదే ఆధారపడి ఉన్నారని, 30 శాతం జీతాల్లో కోత విధించడం సరికాదని అన్నారు.
అయితే, రెండేళ్లపాటు ఎంపీల్యాడ్స్ కూడా రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం పలువురు ఎంపీలు వ్యతిరేకించారు. ఎంపీలు స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన ఈ నిధులను నిలిపివేయడం తగదని, వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే రెండేళ్ల రద్దు వ్యవధిని తగ్గించాలని కోరారు. ఎంపీల జీతాల్లో కోత విధించే బదులు, ఆ మొత్తాన్ని సభకు అంతరాయం కలిగిస్తున్న సభ్యుల నుంచి వసూలు చేస్తే బాగుంటుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సూచించారు. కొందరు ఎంపీలు వాట్సాప్లో సభ్యుల జీతాల కోతను నిర్ణయించుకున్నారని టీఎంసీ ఎంపీ దినేష్ త్రివేది ఆరోపించారు.