Budget 2020 : ప్రధాని మోదీ భద్రత కోసం రూ.600కోట్లు.. గతేడాది కంటే ఎంత పెరిగిందంటే..
ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక భద్రత ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కోసం బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించారు. గతేడాది ఈ బడ్జెట్ రూ.420కోట్లు నుంచి రూ.540కోట్లకు పెరగ్గా.. ఈ ఏడాది మరో రూ.60కోట్లు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3వేలమంది ఎస్పీజీ సిబ్బందితో ప్రత్యేక భద్రతను పొందుతున్న వ్యక్తి నరేంద్ర మోదీ మాత్రమే.
గతేడాది గాంధీ కుటుంబానికి ఎస్పీజీ తొలగింపు..
గతంలో గాంధీ కుటుంబానికి కూడా ఎస్పీజీ భద్రత ఉన్న సంగతి తెలిసిందే. కానీ గతేడాది నవంబర్లో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించింది. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత నుంచి గాంధీ కుటుంబానికి ఎస్పీజీ స్థాయి భద్రతను కల్పిస్తూ వచ్చారు. ప్రస్తుతం వారికి జెడ్ ప్లస్ కేటగిరీ మాత్రమే కొనసాగుతోంది.
గతంలో మాజీ ప్రధానులకు కూడా..
గతంలో మాజీ ప్రధానులకు కూడా ఎస్పీజీ భద్రత ఉండేది. దీని ప్రకారం మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్,దేవే గౌడ,వీపీ సింగ్లకు కూడా గతేడాది వరకు ఎస్పీజీ భద్రత కొనసాగింది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టసవరణ కారణంగా కేవలం ప్రధానికి మాత్రమే ఎస్పీజీ భద్రత కల్పిస్తున్నారు. అలాగే మాజీ ప్రధానికి,ఆయన కుటుంబ సభ్యులకు ఐదేళ్ల పాటు మాత్రమే ఎస్పీజీ భద్రత కల్పిస్తున్నారు. అంతకుముందు మాజీ ప్రధానుల భద్రతకు సంబంధించి ఎలాంటి కటాఫ్ లేదు.
1985లో ఎస్పీజీ స్థాపన
ఇందిరాగాంధీ హత్య నేపథ్యంలో 1985లో ఎస్పీజీని స్థాపించారు. ప్రారంభంలో ప్రధానులకు మాత్రమే ఎస్పీజీ భద్రత ఉండేది. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రధానుల కుటుంబ సభ్యులకు కూడా ఎస్పీజీ భద్రత కల్పించారు. 1999లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎస్పీజీ భద్రతపై సమీక్ష జరిపించి మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు,ఐకె గుజ్రాల్,హెచ్డీ దేవెగౌడల భద్రతను తొలగించారు.