బీజేపీ ఎమ్మెల్యేపై రాళ్ల దాడి వెనుక.. అసలు రహస్యం ఇదీ!
బెంగళూరుః మాజీ ప్రధానమంత్రి, జనతాదళ్ (సెక్యులర్) సీనియర్ నేత దేవేగౌడ త్వరలోనే చనిపోతారని, ఆయన వికెట్ పడిపోతుందంటూ మాట్లాడి, ఆడియో క్లిప్పులతో దొరికిపోయిన కర్ణాటక భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడిపై చోటు చేసుకున్న రాళ్ల దాడిలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి చేసింది జేడీఎస్ నాయకులు, కార్యకర్తలే అయి ఉంటారని తొలుత అనుమానించారు. దేవేగౌడను కించపరిచేలా వ్యాఖ్యానాలు చేయడంతో ఆగ్రహించిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హసన్ లోని ప్రీతమ్ గౌడ ఇంటిపైకి రాళ్లు విసిరినట్లు భావించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం..ఈ దాడికి సంఘ్ పరివార్ కార్యకర్తలే కారణమని తెలుస్తోంది.
ప్రీతమ్ గౌడ ఇంటి వద్ద దర్నా మాత్రమే చేశారని, రాళ్లు విసిరింది మాత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు అయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ రాళ్ల దాడిలో ఆర్ఎస్ఎస్ కు చెందిన క్రియాశీలక కార్యకర్త ఒకరు గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం ఈ అనుమానాలకు బలాన్ని ఇచ్చినట్టవుతోంది. రాళ్ల దాడిలోనే ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా గాయపడి ఉంటారని భావించినా.. దాడి సమయంలో తన వెంట గానీ, ఇంట్లో గానీ బయటి వాళ్లెవరూ లేరని బాధిత ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ స్పష్టం చేశారు. దీనితో- ఈ రాళ్లదాడి ఘటన వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత మేరకు ఉంటుందనే కోణంలో హసన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడ్డ ఆ ఆర్ఎస్ఎస్ కార్యకర్త పేరు రాహుల్ కిణి. ఉడుపికి చెందిన రాహుల్ కొంతకాలంగా హసన్ లో ఉంటున్నారు. హసన్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడతో ఆయనకు పరిచయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దేవేగౌడ, ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి కుమారస్వామిని కించపరుస్తూ ప్రీతమ్ గౌడ మాట్లాడినట్లుగా భావిస్తోన్న ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చిన వెంటనే జేడీఎస్ కార్యకర్తలు హసన్ లోని విద్యానగర ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటి వద్ద బైఠాయించిన విషయం తెలిసిందే.
వారు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో కొందరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రీతమ్ గౌడకు మద్దతుగా నిల్చున్నారు. జేడీఎస్ కార్యకర్తలతో వాగ్వివాదానికి దిగారు. వారిని రెచ్చగొట్టారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకున్నారు. పరస్పరం ఘర్షణ పడ్డారు. దీనితో ఆగ్రహానికి గురైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తొలుత.. రాళ్ల దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
జేడీఎస్ కార్యకర్తల నినాదాలు, బైఠాయింపులతో ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ప్రీతమ్ గౌడపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఓ రాయి నేరుగా ప్రీతమ్ గౌడ కుడి కంటి పైభాగాన్ని బలంగా తాకింది. దీనితో ఆయన ముఖం రక్తసిక్తమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన హాసన్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అదే సమయంలో రాహుల్ కిణి కూడా గాయపడటం, ఆయన సంఘ్ పరివార్ క్రియాశీలక కార్యకర్త కావడం చర్చనీయాంశమైంది. రాహుల్ ఎవరో తనకు తెలియదని ప్రీతమ్ గౌడ చెప్పారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కుమారస్వామి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
ఈ మేరకు ఆయన హసన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కు సూచనలు జారీ చేశారు. మూడురోజుల్లోగా తనకు నివేదిక అందజేయాలని అన్నారు. ఇదిలావుండగా, తమ ఎమ్మెల్యేపై జరిగిన రాళ్ల దాడిని బీజేపీ రాష్ట్రశాఖ తీవ్రంగా పరిగణించింది. కుమారస్వామి ప్రభుత్వ హయాంలో ఓ శాసన సభ్యుడికే రక్షణ లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. జేడీఎస్ కార్యకర్తలే రాళ్లదాడి చేశారని ఎదురుదాడి చేస్తున్నారు.
ఆడియో క్లిప్పుల్లో ఉన్నది ప్రీతమ్ గౌడ గొంతేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోకుండానే.. జేడీఎస్ నాయకులు ఆయన ఇంటిపై దాడి చేసి, గాయపరిచారని అన్నారు. రాళ్లదాడి ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, దీనిపై పార్టీ అధిష్ఠానానికి నివేదించామని చెప్పారు. ఈ ఘటన తరువాత హసన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే కావడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు హసన నగరంలో ఆందోళనలను చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.