మోడీ-అమిత్ షా జోడికి కొత్త చిక్కులు: రిజర్వేషన్ల పున:సమీక్షపై ఆర్ఎస్ఎస్ నుంచి ఒత్తిళ్లు!
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు తరువాత దేశంలో అత్యంత బలమైన నేతలుగా ముద్రపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్ ను విభజించడం, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం అనేది వారిద్దరి వ్యూహమే. తేనెతుట్టె వంటి కాశ్మీర్ అంశాన్ని పరిష్కార మార్గాన్ని చూపించారంటూ దేశం మొత్తం మోడీ-అమిత్ షా జోడిని ప్రశంసించింది. వారిద్దరూ ఎలాంటి క్లిష్టమైన విషయమైనా ఇట్టే పరిష్కరిస్తారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సైతం భుజాలు తట్టింది. అదే ఆర్ఎస్ఎస్ తాజాగా ఆ ఇద్దరి జోడికి సరికొత్త చిక్కులను తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. అదే- రిజర్వేషన్లు.
అర్హులకు అందని రిజర్వేషన్ల ఫలాలు
రిజర్వేషన్లను పున:సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇదివరకే ఓ సారి బాంబు పేల్చారు. తాజాగా మరోసారి ఆయన తన మాటలను సమర్థించుకున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ శిక్షా సంస్కృతి ఉత్థాన్ న్యాస్ సంస్థ జ్ఝాన్ ఉత్సవ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోహన్ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రిజర్వేషన్ల పున:సమీక్ష అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని అంటూనే.. అసలైన లబ్దిదారులకు దాని ఫలాలు అందట్లేదని అన్నారు.
పున:సమీక్షకు సరైన సమయం..
రిజర్వేషన్ల వ్యవస్థను పున:సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన మోహన్ భగవత్.. తన మాటలను మరోసారి ఉటంకించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం నరేంద్ర మోడీ, అమిత్ షా ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకోగల సామర్థ్యాన్ని సమకూర్చుకున్నారని అన్నారు. ఆ ఇద్దరూ తీసుకునే నిర్ణయం ఎలాంటిదైనా దేశం మొత్తం హర్షిస్తుందని చెప్పారు. ఇదే ఊపులో రిజర్వేషన్ల వ్యవస్థను కూడా సమీక్షించాల్సిన అవసరం, సమయం ఏర్పడిందని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. బీజేపీ సారథ్యంలో కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమిలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, వారందరూ తాము చేసిన సూచనలను పాటించాల్సిన అవసరం లేదనీ ట్విస్ట్ ఇచ్చారు. అలాగని- ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలను కూడా తాము సమర్థించాలన్న రూలేమీ లేదనీ చెప్పారు.
రిజర్వేషన్ల అమలులో లోపాలు ఉన్నాయ్
రిజర్వేషన్ల అమలు విధానంలో అనేక లోపాలు ఉన్నాయని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లను రూపొందించే సమయంలో కొన్ని వర్గాలు తమకు అనకూలంగా వాటిని మలచుకున్నాయని అన్నారు. మెజారిటీ వర్గ ప్రజల గళాన్ని వినిపించకుండా చేశారని చెప్పారు. రిజర్వేషన్ల వ్యవస్థలో లోపాలు ఉన్నప్పటికీ.. తాము దానికి వ్యతిరేకం కాదని భగవత్ స్పష్టంచేశారు. ఈ వ్యవస్థను పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని మాత్రమే తాము ముందు నుంచీ చెబుతూ వస్తున్నామని అన్నారు. ఇదివరకు మోహన్ భగవత్ చేసిన ప్రకటనలపై అప్పట్లో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. పలు సామాజిక వర్గాలు ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డాయి. బ్రాహ్మణిజాన్ని ప్రోత్సహించడానికే భగవత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించాయి.