పెళ్లైన జంట ఎంత మంది పిల్లల్ని కనాలో ప్రభుత్వమే నిర్ణయించాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కామెంట్స్
అధిక జనాభా కారణంగానే మనదేశం అనుకున్న స్థాయిలో అభివృద్ది చెందడంలేదని, మతాలకు అతీతంగా పెళ్లైన జంటలు ఎంత మంది పిల్లల్ని కనాలనేదానిపై ప్రభుత్వమే చట్టాన్ని రూపొందించాల్సిన టైమ్ ఆసన్నమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. 'ఇద్దరు పిల్లల' చట్టాన్ని రూపొందించేలా ప్రధాని మోదీని కోరతానని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్లోని మోరదాబాద్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో అభివృద్ధి సవ్యంగా జరగాలంటే 'ఇద్దరు పిల్లల' చట్టం అవసరమని, అది అన్ని మతాలకు సమానంగా వర్తించేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ అంశంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేకాబట్టి, చట్టం రూపొందించాల్సిందిగా ప్రధాని మోదీని, ఇతర పెద్దలను అభ్యర్థిస్తామని తెలిపారు.
దేశ భద్రత, విదేశాంగ విధానాలకు సంబంధించి ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు ఆర్ఎస్ఎస్ ఎల్లప్పుడూ బాసటగా ఉంటుందని, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో అదే తీరును అవలంభిస్తామని భగవత్ అన్నారు. అయోధ్యలో రామ మందిరానికి మార్గం సుగగమమైన నేపథ్యంలో తదుపరి కాశీ, మథుర ఆలయాల పునరుద్ధరణకు సంఘ్ సంస్థలు ఉద్యమిస్తాయంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని, అయోధ్య ఆలయంపై కమిటీ ఏర్పాటైన వెంటనే ఆ అంశాన్ని వదిలేస్తామని భగవత్ క్లారిటీ ఇచ్చారు.