ఆ చర్యల వల్ల పరువు పోతోంది.. ఆ పదాన్ని ఎవరూ పలకొద్దు: ఆర్ఎస్ఎస్ చీఫ్
నాగ్ పూర్: మూకదాడులు, మూక హత్యల వల్ల దేశం పరువు పోతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డుకోవడానికి కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. మూక హత్యలు (లించింగ్) అనే పదం భారతీయ సంస్కృతికి సంబంధించినది కాదని, ఆ పదాన్ని ఎవరూ పలక వద్దని సూచించారు. భారతీయ సంస్కృతితో సంబంధం లేని కొన్ని మతాలు, పాశ్చాత్య దేశాలు ఈ పదాన్ని భారత్ పై రుద్దుతున్నాయని, దీన్ని తరిమి కొట్టాలని అన్నారు.
విజయదశమి సందర్భంగా మహారాష్ట్ర నాగ్ పూర్ లోని రేషింబాగ్ గ్రౌండ్స్ లో మోహన్ భగవత్ ఆయుధ పూజను నిర్వహించారు. విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి స్థానిక లోక్ సభ సభ్యుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సహా సంఘ్ పరివార్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ పలు కీలక అంశాలపై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశంసలతో పాటు హెచ్చరికలు జారీ చేశారు.
దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటోన్న మూక హత్యలు, మూక దాడుల వల్ల ప్రపంచ దేశాల్లో భారత్ పట్ల వ్యతిరేక భావన ఏర్పడుతోందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. మూక హత్యలను నిరోధించడానికి కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అంతర్జాతీయ వేదికల మీద భారత్ పరువును తీయడానికి కొన్ని దేశాలు లించింగ్ అనే పదాన్ని వినియోగిస్తున్నాయని, దీన్ని నిషేధించాలని చెప్పారు. దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయని, వాటిని గుర్తించి నిరోధించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్యం అనేది ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్న వస్తువు కాదని, దీని మూలాలు భారత్ బలంగా ఉన్నాయని అన్నారు. మూలాలను పెకిలించే ఎలాంటి చర్యలనైనా అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత సరిహద్దు ప్రాంతాలు బలహీనంగా ఉంటున్నాయనే విషయం తన దృష్టికి వచ్చిందని, దాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని సూచించారు. సరిహద్దుల్లో భద్రతా బలగాలు, చెక్ పోస్టుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని, నిఘా వ్యవస్థను పటిష్ఠ పర్చాలని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతపత్తిని కల్పించడానికి ఉద్దేశించింన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని మోహన్ భగవత్.. సాహసోపేత చర్యగా అభివర్ణించారు. ఇలాంటి చర్యను కేంద్రం ఎప్పుడో తీసుకోవాల్సిందని అన్నారు. జాప్యం చోటు చేసుకున్న ప్రతి పౌరుడూ హర్షించేలా ప్రవర్తించారని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను ప్రశంసించారు. ఇదివరకు ఎవ్వరూ ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా ఆలోచించడానికి వెనుకాడారని మోహన్ భగవత్ అన్నారు. అలాంటి అంశంపై కేంద్రం ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం సాహసోపేత చర్యగా అభివర్ణించారు.