బీజేపీ, శివసేన దోస్తీకి రంగంలోకి ఆరెస్సెస్, ఉద్ధవ్ సిద్ధం
ముంబై: మహారాష్ట్రలో శివసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సయోధ్య కురిర్చేందుకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘ్చాలక్ మోహన్ భాగవత్ రంగంలోకి దిగారు. ఎన్నికల నేపథ్యంలో శివసేన, బీజేపీ మధ్య దోస్తీ చెడిపోయిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కొన్న సమయంలో, అంతకుముందు కేంద్రమంత్రివర్గ విస్తరణ సమయంలో శివసేన, బీజేపీ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగించడం పట్ల ఆరెస్సెస్, బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శివసేనతో తిరిగి సంకీర్ణం కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శివసేన, బీజేపీలను ఏకతాటి పైకి తెచ్చేందుకు, దోస్తీ కొనసాగింప చేసేందుకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చొరవ తీసుకొని ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.
మరోవైపు, ప్రభుత్వంలో చేరేందుకు శివసేన సభ్యులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో మోహన్ భాగవత్ ఫోన్లో మాట్లాడారని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన ఇరువురూ చర్చించుకున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో తమ మద్దతు తీసుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే వాతావరణాన్ని ఎన్సీపీ సృష్టించింది.
రాబోయే రోజుల్లో ఆ పార్టీతో ఇబ్బందికర పరిణామాలు తప్పవని బీజేపీ భావిస్తోంది. అందుకే శివసేనతో సంకీర్ణం కొనసాగించాలని ఎక్కువ మంది అధిష్టానం పైన ఒత్తిడి తెస్తున్నారు. మోహన్ భాగవత్ ఈ విషయమై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తోను చర్చించారని తెలుస్తోంది. ఉద్ధవ్, దేవంద్రలకు సంకీర్ణం పైన మోహన్ భాగవత్ సూచించినట్లుగా తెలుస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నారంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన నుండి వచ్చాక ఆయనతో మాట్లాడనున్నారు. కాగా, మహారాష్ట్రలో బీజేపీ - శివసేన మధ్య అభిప్రాయభేదాలు వచ్చినా సంబంధాలు తెంచుకునేందుకు శివసేన సిద్ధంగా లేదని ఆ పార్టీ కేంద్రమంత్రి అనంత్ గీతే ెచప్పారు.