ఆరెస్సెస్ సంప్రదించింది.. ఇప్పటికే సమయం మించిపోయిందన్న ఉద్దవ్ థాకరే
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అక్రమమని సుప్రీంకోర్టు మెట్లెక్కిన శివసేన అధినేత ఉద్దవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తమ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆయన.. ఆరెస్సెస్ తనతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేసిందని గుర్తుచేశారు. కానీ ఇప్పటికే ఆలస్యమైందని వివరించారు. ఇక చర్చలు జరిపి కూడా ప్రయోజనం లేదని తమ ఎమ్మెల్యేలకు స్పష్టంచేశారు.
తమ కూటమే
రాష్ట్రంలో తమ కూటమి అధికారం చేపట్టబోవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. తమతో కలిసే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. కానీ అజిత్ పవార్ తిరుగుబాటుతో సమస్య వచ్చిందని గుర్తుచేశారు. ఆ సమస్య కూడా తీరిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ట్వీట్ వార్
బీజేపీతో ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అజిత్ పవార్ ట్వీట్ చేయగా.. వెంటనే శరద్ పవార్ ఖండించిన సంగతి తెలిసిందే. దీంతో శరద్ పవార్ బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలవబోడని ఉద్దవ్ స్పష్టంచేశారు. శివసేన కూటమికి ఎన్సీపీ స్నేహహస్తం అందించిందని తెలిపారు.
తూచ్.. కాదు, కాదు
బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని.. ఐదేళ్లు సుస్థిరంగా పాలిస్తామని అజిత్ పవార్ ట్వీట్ చేశారు. తమ నాయకుడు శరద్ పవర్ అని స్పష్టంచేశారు. దీంతో కలకలం రేగింది. నేతలకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని వెంటనే శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.
ఉత్కంఠభరితం..
మహారాష్ట్రలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రాకపోవడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. బీజేపీకి శివసేన 50-50 ఫార్ములా తీసుకురావడంతో వారి మధ్య పొత్తు పొడవలేదు. దీంతో శివసేన కూటమి తెరపైకి రాగా.. శనివారం ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయడం చర్చానీయాంశమైంది. శివసేన కూటమి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో రాజకీయాలు మరింత హీటెక్కిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు విచారణ
మహారాష్ట్రలో శనివారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేసి.. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సీఎం, డిప్యూటీ సీఎంలుగా పదవీ ప్రమాణం స్వీకారం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా..ఫడ్నవీస్, అజిత్కు నోటీసులు జారీచేసి.. సోమవారం ఉదయానికి విచారణ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.