ఆరెస్సెస్ మీ మాటలు మరిచిపోతుంది, విజువల్స్ ఉంటాయి: ప్రణబ్ కూతురు షర్మిష్ట
న్యూఢిల్లీ: తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్లో నిర్వహిస్తున్న ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లడంపై ఆయన కూతురు షర్మిష్టా ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె బుధవారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. ఆరెస్సెస్ పైన మండిపడ్డారు. షర్మిష్ట ఢిల్లీ మహిళా కాంగ్రెస్ చీఫ్ కూడా.
ప్రణబ్ను ఆరెస్సెస్ సమావేశానికి పిలిచి ఆరెస్సెస్, బీజేపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. తప్పుడు కథనాలు చెప్పుకోవడం, ప్రజల్లో కొత్త అనుమానాలు రేకెత్తించడం ఆ రెండు సంస్థల లక్ష్యం అన్నారు. ప్రణబ్ ఏం మాట్లాడారనేది ఆరెస్సెస్కు కూడా గుర్తుకు ఉండదని, కానీ ఆయన రాకకు సంబంధించిన విజువల్స్ మాత్రం ఉంటాయన్నారు.
మీ (ప్రణబ్ ముఖర్జీ) ప్రసంగంలో ఆరెస్సెస్ సిద్ధాంతాలకు మద్దతు పలుకుతారని వాళ్లకు కూడా నమ్మకం లేదని, మీ వ్యాఖ్యలను మరిచిపోయినా ఆ దృశ్యాలకు బూటకపు వ్యాఖ్యలు జోడించి ప్రచారం చేస్తారని షర్మిష్ట మండిపడ్డారు. ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లడం ద్వారా మీరు (ప్రణబ్) తప్పుడు కథనాలకు ఆస్కారం ఇస్తున్నారని చెప్పారు.