కళ్లు మూసుకుంటే వారు పెరుగుతారు: ఆర్ఎస్ఎస్
రాంచీ: ఆర్ఎస్ఎస్ ఓ అంశాన్ని ముందుకు తీసుకు వచ్చి దేశ వ్యాప్తంగా చర్చకు తెర తీస్తున్నది. బంగ్లాదేశీయులు భారత్ లోకి అక్రమంగా వచ్చేస్తున్నారని, ఇలాగే కళ్లు మూసుకుంటే భారత్ లో రానురానూ విదేశీయులు పెరిగిపోతారని ఆర్ఎస్ఎస్ నాయకుడు మన్మోహన్ వైద్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య రాంచీలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశీయులు అసోం, బెంగాల్ లో అక్రమంగా మకాం వేశారని ఉపమాన్యూ హజారికా కమిషన్ ఇచ్చిన నివేదిక పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల బెంగాల్ తోపాటు అసోంలో మారుతున్న జనాభా స్థితిగతులపై ఒక నివేదికను హజారికా కమిషన్ వెల్లడించిందని గుర్తు చేశారు. ఇలాగే ఉంటే 2047 నాటికి భారతీయులు తగ్గిపోయి విదేశీయులు ఎక్కువ అయిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరగవలసిన అవసరం ఎంతైనా ఉందని మన్మోహన్ వైద్య అన్నారు. దీన్ని తాము సీరియస్ గా తీసుకుంటున్నామని రేపు ఓ తీర్మానం ప్రవేశపెడతామని కూడా చెప్పారు. రాంచీలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరుకానున్నట్లు అన్నారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు అంశంపై సుప్రీంకోర్టు హజారికా కమిషన్ ను వేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై నవంబర్ 5లోగా స్పందిచాలని కూడా సుప్రీంకోర్టు అసోంను ఆదేశించింది. అసోం, బెంగాల్ లో ఎక్కడ చూసినా బంగ్లాదేశీయులే దర్శనం ఇస్తున్నారని ఆరోపించారు.
ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని మన్మోహన్ వైద్య డిమాండ్ చేశారు. అసోం, బెంగాల్ తో పాటు కర్ణాటకలోనూ అధిక సంఖ్యలో బంగ్లాదేశీయులు తలదాచుకున్నారని గుర్తు చేశారు. బంగ్లాదేశీయులను గుర్తించి వెంటనే వారి దేశానికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు.