జగన్ ను ఆకాశానికెత్తేసిన ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్: మీరెందుకు చేయలేరంటూ బీజేపీ సీఎంలకు హితవు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాజీ ప్రచారక్ ఉమేష్ జీ ఆకాశానికి ఎత్తేశారు. వైఎస్ జగన్ తీసుకున్న ఒక్క నిర్ణయం హిందూ దేవాలయాలు, ధార్మిక సంఘాలు అన్యమతాల బారిన పడకుండా కాపాడుతోందని అన్నారు.
నీకూ..నీ తుగ్లక్ ముఖ్యమంత్రికి లోకేష్ నామస్మరణేనా..దొంగ రాజైపోడు? టీడీపీ ఫైర్
ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల సహా ఏపీలోని మరే ఆలయంలోనూ హిందూయేతర వ్యక్తులు ఉద్యోగాలు పొందడాన్ని నిషేధించారని, ఆలయ పరిసరాల్లో షాపులు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేశారని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన ఫేస్ బుక్ ఖాతాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలకు వైఎస్ జగన్.. శంఖాన్ని పూరిస్తోన్న ఫొటోను జత చేశారు.
భారతీయ జనతాపార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి నిర్ణయాలు, హైందవ ధర్మాన్ని కాపాడే చర్యలను ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ.. ఆయనకు సరైన ప్రచారం దక్కలేదని చెప్పారు. దీనికి సంబంధించిన సరైన సానుకూల వార్తలు మీడియాలో తనకు కనిపించట్లేదని ఉమేష్ జీ వ్యాఖ్యానించారు.
ఎందుకింత వివక్షతను చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ఏ ఒక్క ముఖ్కమంత్రయినా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటే.. త్రేతాయుగం నాటి దేవుళ్లతో వారిని పోల్చేవారని అన్నారు. వైఎస్ జగన్ ఓటుబ్యాంకును సైతం పక్కన పెట్టి మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని, దీన్ని బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అనుసరించాలని సూచించారు.