హంగ్ వస్తే.. మోడీని తప్పిస్తారా? నితిన్ గడ్కరీతో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భేటీ!
ముంబై: భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) వరుసగా బంపర్ మెజారిటీ సాధించి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో.. రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వెలువడి 24 గంటలు కూడా గడవక ముందే- రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి ఓ కీలక అడుగు వేశారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను నరనరాన నింపుకొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు.
యాంటీ బీజేపీ ఫ్రంట్: వైఎస్ జగన్ కోసం ఎన్సీపీ చీఫ్ రాయబారం!
పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జి కూడా..
సోమవారం మధ్యాహ్నం మహారాష్ట్రలోని నాగ్పూర్లో నితిన్ గడ్కరీ నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. భయ్యాజీ జోషీ సుమారు గంటకు పైగా నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భయ్యాజీ జోషితో పాటు పశ్చిమ బెంగాల్ బీజేపీ ఇన్ ఛార్జి కైలాష్ విజయ్ వర్గీయ కూడా ఉన్నారు. అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు.
నితిన్ గడ్కరీ పేరు పరిశీలనా?
ప్రధాన మంత్రిగా నితిన్ గడ్కరీ పేరును పరిశీలించాలంటూ కొద్దిరోజుల కిందట వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాను ప్రధాని రేసులో లేనంటూ నితిన్ గడ్కరీ ప్రకటించారు. తనకు తాను వివరణ ఇచ్చుకున్నారు. హంగ్ అంటూ ఏర్పడితే- నితిన్ గడ్కరీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆర్ఎస్ఎస్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ఈ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
హంగ్ వస్తే.. మోడీని తప్పిస్తారా?
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ స్థానాలు దక్కకపోతే- ఎన్డీఏలోని ఇతర మిత్ర పక్షాల సహకారంతో నితిన్ గడ్కరీని ప్రధాన మంత్రిగా చేయాలని భయ్యాజీ జోషి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం.. ఇదే తరహా అభిప్రాయంలో ఉన్నట్లు లీకులు ఇచ్చారు. నితిన్ గడ్కరీని ప్రధానమంత్రిని చేస్తే- తాము మళ్లీ ఎన్డీఏలో చేరుతామని అంటూ చంద్రబాబు స్పష్టం చేసినట్లుగా `విశ్వసనీయ` వర్గాల ద్వారా వెల్లడైంది.
ఈ క్రమంలో- ఎగ్జిట్ పోల్స్ వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే నితిన్ గడ్కరీని భయ్యాజీ జోషి కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరిచుకుంది. విశ్లేషకుల బుర్రలకు పని పెట్టింది. వారిద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలు ఏమిటన్నది ఇంకా తెలియరావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ- ప్రధానిగా నితిన్ గడ్కరీ పేరును పరిశీలించాలనే ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఆర్ఎస్ఎస్ ప్రభావం..
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరించే నాయకుడు నితిన్ గడ్కరీ. ఆయన ప్రతి చర్యలోనూ ఆర్ఎస్ఎస్ భావజాలం కనిపిస్తుంది. ఇదివరకు భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఆయన నాగ్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. 2014లోనూ ఆయన ఇదే స్థానం నుంచి సుమారు మూడు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ముత్తెంవార్పై ఘన విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.