ఢిల్లీ కార్యక్రమానికి రాహుల్ గాంధీకి, ఏచూరిలకు ఆరెస్సెస్ ఆహ్వానం!
న్యూఢిల్లీ/నాగపూర్: కొద్ది నెలల క్రితం నాగపూర్లో జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆ సంస్థ ఆహ్వానించింది. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ఢిల్లీలో జరగనున్న ఓ కార్యక్రమానికి అహ్వానించనున్నదని తెలుస్తోంది.
ఆరెస్సెస్ అంటేనే రాహుల్ గాంధీ అంతెత్తున లేస్తారు. రాజకీయంగా బీజేపీని విమర్శించే దాదాపు ప్రతి సందర్భంలో ఆరెస్సెస్ను లాగి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అలాంటి ఆరెస్సెస్ ఆయనను తమ కార్యక్రమానికి ఆహ్వానించనుండటం గమనార్హం.
సెప్టెంబర్ నెలలో 17 నుంచి 19 వరకు ఢిల్లీలో ఆరెస్సెస్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాహుల్తో పాటు సీతారాం ఏచూరి లాంటి ఇతర ప్రతిపక్ష నేతలను కూడా పిలవాలని ఆరెస్సెస్ భావిస్తోంది. భవిష్యత్తు భారత్పై ఈ కార్యక్రమంగా ప్రధానంగా దృష్టి సారించనుంది.
ఈ ఏడాది జూన్లో నాగ్పూర్లో జరిగిన కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీని ఆరెస్సెస్ ఆహ్వానించింది. అప్పట్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఆయన అసలు హాజరవుతారా లేదా అనే చర్చ సాగింది. ఆయన హాజరయ్యారు. మంచి సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీకే ఆహ్వానం పంపాలని ఆరెస్సెస్ భావిస్తుండటం గమనార్హం.