ప్రణబ్ ముఖర్జీ ఏం మాట్లాడుతారు?: ఫేస్బుక్లో ఆరెస్సెస్ లైవ్, అహ్మద్ పటేల్ అసంతృప్తి
నాగపూర్: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) సమావేశానికి హాజరవుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్కడ ఏం మాట్లాడుతారనేది ఆసక్తిగా మారింది. దేశం, జాతీయత, దేశభక్తి గురించి మాట్లాడుతారని తెలుస్తోంది. అదే సమయంలో సెక్యులరిజం పైన మాట్లాడుతారని సమాచారం.
కాగా ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాన్ని ఆరెస్సెస్ తమ అధికారిక ఫేస్బుక్లో లైవ్గా ప్రసారం చేయనుంది. facebook.com/RSSOrg లో దీనిని చూడవచ్చు.
ఆరెస్సెస్ భేటీకి ప్రణబ్ ముఖర్జీ హాజరు కావడంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు అహ్మద్ పటేల్ కూడా చేరారు. ప్రణబ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు ఊహించలేదన్నారు. ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. 'ప్రణబ్ దా ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు...!' అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తృతీయ వర్ష సంఘ్ శిక్షా వర్గకు ముఖ్య అతిథిగా రావాలన్న ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించడంపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంతో ఉంది. ప్రణబ్ నాగ్పూర్ వెళ్లడాన్ని ఆయన కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు షర్మిష్ఠ ముఖర్జీ కూడా తప్పుబట్టారు.