కేరళ వరదలు: ఆరెస్సెస్-ముస్లీం ఎన్జీవో సంస్థ కలిసి సాయం, సేవాభారతి అండ
తిరువనంతపురం: కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా కుదురుకుంటోంది. కేరళ ప్రజలకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, మత్స్యకారులు, వివిధ సేవా సంస్థలు చేయూతనిచ్చాయి. ఎన్నో సేవా సంస్థలు రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశాయి. ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థ సేవాభారతి కూడా కేరళీయులకు అండగా నిలబడింది.
దశాబ్దాల క్రితం విశాఖ వరదల సమయంలో ఆరెస్సెస్ చేసిన సాయాన్ని ఎవరూ మర్చిపోలేరు. దాదాపు నాలుగేళ్ల క్రితం హుధుద్ తుఫాను వచ్చినప్పుడు కూడా ఆరెస్సెస్ చేయూత అందించారు. హుధుద్ సమయంలో ఆరెస్సెస్ కార్యకర్తలు మసీదును కూడా శుభ్రం చేశారు. సేవకు లిమిట్స్ ఉండవని, ఆరెస్సెస్ అంటేనే మానవత్వమని ప్రశంసలు అందుకుంది.
ఆరెస్సెస్ సేవాభారతి-ఉస్మానియా చారిటబుల్ ట్రస్ట్ సహాయం
తాజాగా, కేరళీయులకు ఆరెస్సెస్ అండగా నిలిచింది. ఇక్కడ ముస్లీంలు నడుపుతున్న ఓ ఎన్జీవో, ఆరెస్సెస్ కలిసి వరద బాధితులకు సహాయ సహకారాలు అందించారు. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ సేవాభారతి, ముస్లీంల ఆద్వర్యంలో నడుస్తున్న ఉస్మానియా చారిటబుల్ ట్రస్ట్ కలిసి పని చేశాయి. ఈ సంఘటన కొడుగులో చోటు చేసుకుంది. ఆగస్ట్ 16వ తేదీ నుంచి మడికెరి పరిసర ప్రాంతాల్లోని వారు వరద నీటిలో చిక్కుకుపోగా, వీరు కలిసి రక్షించారు.
మాకు సహాయం చేశారని అంజలి
కొడుగుకు చెందిన అంజలి మాట్లాడుతూ.. మేం ఎంతో భయపడ్డామని, కానీ సేవా భారతి, చారిటబుల్ ట్రస్ట్ కలిసి తమను కాపాడాయని వెల్లడించారు. వారు తమను రిలీఫ్ క్యాంప్కు తరలించారన్నారు. తమను సురక్షితంగా ఇక్కడకు తీసుకు వచ్చారని, కొందరు ముసలివాళ్లు ఉన్నారని, వారిని కూడా ఎంతో ఇక్కట్ల మధ్య తీసుకు వచ్చారని చెప్పారు. ఆ బాధాకర అనుభవం తమను వెంటాడుతోందని, ఇలాంటి సమయంలో యోగాతో తాను ఉపశమనం పొందుతున్నానని, తాను ఓ క్రైస్తవురాలును అయినప్పటికీ 'ఓం' అంటూ యోగాతో ప్రశాంతత పొందుతున్నానని చెప్పారు.
వెయ్యి మందికి సేవాభారతి-ఉస్మానియా టారిటబుల్ ట్రస్ట్ రిలీఫ్
లక్ష్మీ అనే మహిళ మాట్లాడుతూ.. వరదల వల్ల తమ ఇల్లు కూలిపోయిందని, తాము సర్వం కోల్పోయామని చెప్పారు. పినరాయి ప్రభుత్వం సహాయం చేస్తుందని తనలాంటి వాళ్లు ఎంతోమంది నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు. తమతో పాటు దాదాపు ఇక్కడి వెయ్యి మంది కుటుంబాలకు సేవాభారతి, ఉస్మానియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రిలీఫ్ మెటీరియల్ ఇచ్చిందని చెప్పారు. కేరళ వరద బాధితులకు సహాయం చేసేందుకు సేవాభారతి ఓ అకౌంట్ నెంబర్ ద్వారా నిధులు కూడా సేకరించి ఇస్తోంది.
కేరళీయులకు అండగా 20వేల మంది స్వయం సేవకులు
కేరళలో 20వేల మంది స్వయం సేవకులు సహాయ సహకారాల కోసం రంగంలోకి దిగారు. కేరళలను ఆదుకునే క్రమంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా పలువురు ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రజల ప్రాణాలు కాపాడటం, వారికి రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆహారం, దుప్పట్లు అన్నీ ఏర్పాటు చేయడంతో పాటు గుడులు, మసీదులు, చర్చిలు అనే తేడా లేకుండా శుభ్రం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని సేవాభారతి కార్యాలయాలు దుస్తులు, ఆహార పదార్థాలు.. ఇతర అవసరమైన వస్తువులను డీసీఎంలు, లారీలలో తరలించారు. సేవాభారతి ఆధ్వర్యంలో చెంగన్నూరు తదితర ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు.