త్వరలో ఆర్ఎస్ఎస్ క్రిస్టియన్ విభాగం !
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) త్వరలో క్రిస్టియన్ విభాగాన్ని ప్రారంభించాలని భావిస్తుందని తెలిసింది. ఇదే విషయంపై డిసెంబర్ 17వ తేదిన వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు క్రిస్టియన్ మత పెద్దలతో సమావేశాన్ని కూడా నిర్వహించారు.
దశాబ్దం క్రితం ఆర్ఎస్ఎస్ ముస్లీం విభాగం, రాష్ట్రీయ ఇసాయ్ మంచ్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే విధానంలో క్రిస్టియన్ విభాగాన్ని కూడ ఏర్పాటు చెయ్యాలని ఆర్ఎస్ఎస్ నాయకులు యోచిస్తున్నారు.
అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 17వ తేదిన నిర్వహించిన సమావేశాన్ని పునాదిగా భావించవచ్చని ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యనిర్వహక సభ్యుడు ఇంద్రేష్ కుమార్ అన్నారు.
క్రిస్టియన్ కమ్యూనిటీతో సంత్సంబంధాలు పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ నాయకులు భావిస్తున్నారు. అందు కోసం ఆర్ఎస్ఎస్ క్రిస్టియన్ విభాగం ఏర్పాటు చెయ్యాలని నాయకులు అంటున్నారు.
దేశంలో మత అసహనం పెరిగిపోతుందంటూ చెలరేగుతున్న దుమారానికి కూడా ఇది కొంత స్వాంతన కలిగించే చర్యగా ఆర్ఎస్ఎస్ వర్గాలు ముందుకు వెలుతున్నాయి. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ నాయకులు ఎంత వరకు ఈ విషయంలో సక్సస్ అవుతారో వేచి చూడాలి.