అంబేడ్కర్ కంటే ముందే మదర్ థెరిస్సాకు భారతరత్న ఎందుకిచ్చారు: ఆరెస్సెస్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మదర్ థెరిస్సాల విషయమై కొత్త విషయాన్ని చెప్పింది! అంబేడ్కర్ను అనేక ఏళ్ల పాటు విస్మరించారని ఆరెస్సెస్ మండిపడింది. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను అంబేడ్కర్ కంటే ముందే థెరిస్సాకు ఎందుకిచ్చారని ప్రశ్నించింది.
అంబేడ్కర్ 124వ జయంతి సందర్భంగా ఆయనను ఆరెస్సెస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్తో ఆరెస్సెస్ పోల్చింది. 370వ అధికరణ పైన వారిద్దరికీ ఒకేలాంటి అభిప్రాయాలు ఉన్నాయని చెప్పింది. ఆరెస్సెస్ పత్రికలైన ఆర్గనైజర్, పాంచజన్య ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి మాట్లాడారు.
అంబేడ్కర్ సామాజిక న్యాయం కోసం ఎంతో పోరాడారని చెప్పారు. ఆయనకు 1990లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం హయాంలో భారతరత్న ఇచ్చారని, అంతకు పదేళ్ల ముందే అంటే.. 1980లోనే థెరిస్సాకు భారత అత్యున్నత పురస్కారం ఇచ్చారని విమర్శించారు. నాటి ప్రభుత్వాలు అంబేడ్కర్ను విస్మరించాయనేందుకు ఇదే నిదర్శనమని ఆరెస్సెస్ అభిప్రాయపడింది.