పీడీపీ-బీజేపీ తెగదెంపుల వెనుక ఆరెస్సెస్, కారణం ఇదే! రాష్ట్రపతి పాలనపై రాహుల్ ఆగ్రహం
Recommended Video
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడం వెనక ఆరెస్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పీడీపీతో పొత్తు వల్ల జమ్ము కాశ్మీర్లోని హిందువుల్లో బీజేపీ పట్టు కోల్పోతోందని, మున్ముందు ఇది బీజేపీకి ఎదురుదెబ్బ కాగలదని ఆరెస్సెస్ భావించింది. ఈ విషయాలను బీజేపీ అధిష్ఠానానికి చెప్పడం వల్లే సంకీర్ణ ప్రభుత్వంతో బీజేపీ తెగదెంపులు చేసుకుందని సమాచారం.
నేనేం షాక్ కాలేదు: ముఫ్తీ, అప్పుడే నిర్ణయం: రాంమాధవ్, కాశ్మీర్ పరిణామాలపై కేంద్ర హోంశాఖ దృష్టి
వారం రోజుల క్రితం హర్యానాలోని సూరజ్కుండ్లో బీజేపీ, ఆరెస్సెస్ నేతలు సమావేశమయ్యారు. 3 రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో జమ్ము కాశ్మీర్లోని పరిస్థితులపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో పీడీపీతో కలిసి వెళ్తే బీజేపీ దెబ్బతింటుందని, గతంలో వచ్చినన్ని సీట్లు కూడా రావని అభిప్రాయపడ్డారు. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
దానికి తోడు ఇటీవలి పరిణామాలు బీజేపీని బాధిస్తున్నాయి. ఉగ్రవాదానికి మతం లేదని చెబుతారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించాలని ముఫ్తీ చెప్పడం బీజేపీ జీర్ణించుకోలేకపోయింది. దీంతో పీడీపీతో కటీఫ్ చెప్పినట్టు తెలుస్తోంది.
దీంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో పీడీపీ ఆధిపత్య ధోరణి కూడా ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది. గవర్నర్ పాలన ద్వారా రాష్ట్రంపై పూర్తి పట్టు సాధించవచ్చనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. పాలనపై పూర్తి అధికారం ఉంటే రాష్ట్రంలో చెలరేగిపోతున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదుల పీచమణచవచ్చని భావిస్తోంది.
రాష్ట్రపతి పాలనపై రాహుల్ గాంధీ స్పందన
బీజేపీ - పీడీపీ అవకాశవాద పొత్తుతో జమ్ము-కాశ్మీర్లో పరిస్థితి అదుపు తప్పిందని, ఎంతోమంది అమాయక ప్రజలతో పాటూ మన సైనికుల ప్రాణాలు కోల్పోయామని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ విమర్శించారు. కాశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వం చర్యల కారణంగా ఎంతోమంది ప్రజలు, సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. కొన్నేళ్ల పాటు యూపీఏ చేసిన కృషిని బీజేపీ ధ్వంసం చేసిందన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తే ఇకపై ఇదే తీరు కొనసాగుతుందని, అసమర్థత, అహంకారం, ద్వేషం ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటాయని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.