షాక్: నరేంద్రమోడీపై ఆరెస్సెస్ అసహనం, మండిపాటు?
లక్నో: నరేంద్ర మోడీ ప్రభుత్వం తీరు పైన ఆరెస్సెస్ అసంతృప్తితో ఉందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీరు పైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్వయంగా ఆరెస్సెస్ సర్ సంచాలకులు మోహన్ భాగవత్ కేంద్రం తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో ఆరెస్సెస్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల రెండో రోజైన నవంబర్ 2వ తేదీన మోహన్ భాగవత్.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పైన ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.
ఆంగ్ల మీడియాలో వస్తున్న సమాచారం మేరకు... మోడీ ప్రభుత్వం నుండి ఆశించిన ఫలితాలు రావడం లేదని భాగవత్ అన్నారు. హిందుస్తాన్లోని వారంతా హిందువులు అన్న తమ వ్యాఖ్యల పైన కొందరు అనవసరంగా రాద్దాంతం చేశారని, దానికి దురుద్దేశ్యంతో ఏదో రంగు పులిమే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ వ్యాఖ్యల పైన నిష్పక్షపాతంగా విశ్లేషించే ప్రయత్నం చేయలేదన్నారు. తమ వ్యాఖ్యల పైన అధికారంలో ఉన్న పార్టీ స్పందించాల్సి ఉండెనని అభిప్రాయపడ్డారు. కానీ వారు దీని పైన మౌనం వహించారని ఆరోపించారు. ఇలాంటి వైఖరి ప్రజలను బాధిస్తుందన్నారు.
అదే సమయంలో, కేంద్రం ఆశించినమేర పని చేస్తుందనే ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాగా, సంఘ్ అజెండాను అమలు పరిచేందుకు ఆరెస్సెస్ కేంద్రమంత్రులను కలిసి కొన్ని ప్రతిపాదనలు కూడా చేయనుందని తెలుస్తోంది. ఇటీవలే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విద్య విషయంలో సంఘ్ నేతలతో భేటీ అయ్యారు.
ఆరెస్సెస్ సమావేశంలో ఉత్తర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. యూపీలో బీజేపీ సమాజ్వాది పార్టీ వ్యాఖ్యల పైన ఇటీవల ధీటుగా స్పందించింది.
ఎస్పీ నేత అజమ్ ఖాన్ మాట్లాడుతూ.. ఆరెస్సెస్ను యూపీలో బ్యాన్ చేయాలని వ్యాఖ్యానించారు. దీని పైన బీజేపీ యూపీ చీఫ్ లక్ష్మీకాంత్ బాజపాయి ధీటుగా స్పందించారు. అజమ్ ఖాన్ తీరు చూస్తుంటే ఆయన మెంటల్ బ్యాలన్స్ తప్పినట్లుగా కనిపిస్తోందని, రాష్ట్రంలో వారి ప్రభుత్వమే ఉందని చెప్పారు.