కరోనా ఎఫెక్ట్.. ఆ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ఆర్ఎస్ఎస్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అటు కేంద్రమంత్రులు సైతం ఇప్పటికే తాము పాల్గొనాల్సిన సభలు,సమావేశాలను వాయిదా వేసుకున్నారు. పబ్లిక్ ఈవెంట్స్కు దూరంగా ఉండటమే మంచిదని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఈ నెల 14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగాల్సిన ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అఖిల భారతీయ ప్రతినిధి సభ(ABPS) సమావేశాలను కూడా రద్దయింది. ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ సురేష్ భయ్యాజీ జోషీ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన సూచనల మేరకు సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపారు. నిజానికి నిన్నటివరకు ఈ సమావేశాలను నిర్వహించాలనే ఆర్ఎస్ఎస్,ఏబీపీఎస్ భావించాయి. సమావేశానికి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలకు చెందిన 1,500 మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేసింది.
సమావేశాలకు వచ్చేవారు కరోనా టెస్టులు చేసుకుని రావాలని షరతు కూడా విధించింది. కానీ ఇంతలోనే నిర్ణయాన్ని సమీక్షించుకుని సమావేశాన్ని రద్దు చేసింది. ఆర్ఎస్ఎస్కు సంబంధించిన అత్యున్నత నిర్ణయాలను ఏబీపీఎస్ తీసుకుంటుందన్న సంగతి తెలిసిందే.
దేశంలో కరోనా కారణంగా నమోదైన తొలి మరణం కర్ణాటకలోనే కావడంతో అక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇప్పటికే అక్కడి మాల్స్,థియేటర్స్ మూసివేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. దీంతో కర్ణాటకలో రోడ్లు వెలవెలబోతున్న పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే మెట్రో సైతం ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. చాలావరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. మొత్తం మీద కర్ణాటకలో కోవిడ్ 19 ఎఫెక్ట్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.