నేతాజీ జయంతిలో జై శ్రీరామ్ నినాదాలా-ఆరెస్సెస్ అసంతృప్తి-బీజేపీ చర్యలకు డిమాండ్
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చేస్తున్న ఫీట్లు ఆరెస్సెస్కు కోపం తెప్పిస్తున్నాయి. తాజాగా కోల్కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆరెస్సెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరోజు జరిగిన పరిణామాలపై బీజేపీ స్పందించి చర్యలు తీసుకోవాలని తాజాగా ఆరెస్సెస్ నేతలు కోరారు.
కోల్కతాలో ఈ నెల 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో నిర్వహించిన పరాక్రమ్ దివస్ వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు బీజేపీ కార్యకర్తలు జై శీరామ్ నినాదాలు చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన మమత ఈ సభలో మాట్లాడేందుకు నిరాకరించారు. దీంతో ఈ నినాదాల వ్యవహారం వివాదాస్పమైంది. నేతాజీ జయంతి కార్యక్రమంలో మాట్లాడేందుకు సీఎం మమతను ఆహ్వానించగానే జై శ్రీరామ్ నినాదాలు చేయడంతో ఆమె ఇది ప్రభుత్వ కార్యక్రమమని, రాజకీయ కార్యక్రమం కాదని, మర్యాదగా వ్యవహరించాలని, ఇలా అతిధుల్ని పిలిచి అగౌరవపరిచే చర్యలకు దిగడం నిర్వాహకులకు మంచిది కాదని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ఈ నినాదాలు చేసిన వారిపై విమర్శలు వెల్లువెత్తాయి.
Recommended Video
ఓ స్వాతంత్ర సమరయోధుడి జయంతిని అవమానించే విధంగా జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో కోరింది. నేతాజీకి నివాళులు అర్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో జై శ్రీరామ్ నినాదాలు చేయడం ఏంటని బెంగాల్ ఆరెస్సెస్ కార్యదర్శి జిష్ణు బసు మండిపడ్డారు. జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారు తమ చర్యలతో అటు నేతాజీకీ ఇటు రాముడికీ ఇద్దరికీ గౌరవం లేకుండా చేశారని విమర్శించారు.