కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య: ఆరుగురు ఎస్డీపీఐ వర్కర్స్ అరెస్ట్
అలప్పుజ: కేరళ రాష్ట్రంలో మరో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఈ హత్యకు దారితీసింది. ఈ ఘటన అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
అలప్పుజలోని వయలార్ పట్టణ సమీపంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో నందు అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ఎస్డీపీఐ వర్కర్స్ దారుణంగా హత్య చేశారు. కాగా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) రాజకీయ విభాగమే ఈ ఎస్డీపీఐ.
ఈ ఘర్షణల్లో పలువురు ఆర్ఎస్ఎస్, ఎస్డీపీఐ కార్యకర్తలు తీవ్రగాయాలపాలయ్యారు. నందుపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
Kerala: BJP & Hindu outfits have called for a shutdown in Alappuzha district from 6 am to 6 pm today in protest against the death of an RSS worker in a clash with SDPI workers last night, says BJP district president MV Gopakumar
— ANI (@ANI) February 25, 2021
ఘటనపై కేసు నమోదు చేసి, ఆరుగురు ఎస్డీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్యకు నిరసనగా గురువారం అలప్పుజ జిల్లా బంద్కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు బంద్ కొనసాగుతుందని బీజేపీ నేతలు తెలిపారు. కేరళలో గతంలోనూ పలువురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హత్యలకు గురికావడం గమనార్హం.