స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు... తొలిసారి ఈ హోదా... హరిద్వార్ కుంభమేళాలో విధులు...
ఉత్తరాఖండ్ హరిద్వార్లోని గంగానదిలో జరుగుతున్న కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్న సంగతి తెలిసిందే. బుధవారం(ఏప్రిల్ 14) ఒక్కరోజే దాదాపు 6లక్షల మంది షాహీ స్నాన్(రాజ స్నానం) ఆచరించారు. ఇప్పటివరకూ మొత్తం 31లక్షల మంది గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు కుంభమేళా జరగనుండటంతో మరింత మంది భక్తులు గంగానదికి పోటెత్తనున్నారు. లక్షల సంఖ్యలో తరలివస్తున్న భక్తులను అదుపు చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తొలిసారిగా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు(ఎస్పీవో)గా నియమించడం గమనార్హం.
రోజూ 12 గంటల పాటు విధుల్లో...
దాదాపు 1553 మంది ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా ప్రభుత్వం నియమించింది. వీరంతా హరిద్వార్లో ఏప్రిల్ 7 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు.ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ 12 గంటల పాటు విధుల్లో ఉంటున్నారు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. గుంపులు,గుంపులుగా తరలివస్తున్న భక్తులను,ట్రాఫిక్ను మేనేజ్ చేయడంలో పోలీసులకు సహాయపడుతున్నారు.
స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా ఐడీ కార్డులు...
స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించబడ్డ ఆర్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రభుత్వం ఐడీ కార్డులతో పాటు ఒక టోపీ,ఒక జాకెట్ ఇచ్చింది. నిజానికి ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు గతంలోనూ కుంభమేళాలో విధులు నిర్వర్తించారని... కానీ ఈసారి వారికి అధికారికంగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ హోదాతో ప్రభుత్వం ఐడీ కార్డులు ఇచ్చిందని కుంభమేళాలో డిప్యూటీ ఎస్పీ బీరేంద్ర ప్రసాద్ దర్బల్ తెలిపారు. కేవలం ఆర్ఎస్ఎస్ నుంచి మాత్రమే కాకుండా కాంగ్రెస్ సేవా దళ్ నుంచి కూడా వాలంటీర్లను కుంభమేళ విధుల్లో మోహరించారని... వారికి కూడా స్పెషల్ పోలీస్ ఆఫీసర్(ఎస్పీవో)గా ఐడీ కార్డులు ఇచ్చారని చెప్పారు.
ఎంపిక ఇలా...
ఈ ఏడాది కుంభమేళా విధుల్లో 1500 పైచిలుకు ఆర్ఎస్ఎస్ వాలంటీర్లను మోహరించినట్లు డిప్యూటీ ఎస్పీ బీరేంద్ర ప్రసాద్ వెల్లడించారు. వాలంటీర్ల ఎంపిక గురించి మాట్లాడుతూ... రాష్ట్రంలోని అన్ని ఆర్ఎస్ఎస్ యూనిట్లకు తాను లేఖలు రాసినట్లు చెప్పారు. 18 ఏళ్ల 50 ఏళ్ల వయస్కులు,కుంభమేళాలో విధులు నిర్వర్తించేందుకు ఆసక్తిగల వారి వివరాలను పంపించాల్సిందిగా కోరినట్లు తెలిపారు.
ఆర్ఎస్ఎస్ యూనిట్ల నుంచి వచ్చిన పేర్లు,వివరాలను విశ్లేషించి... 1500 పైచిలుకు మందిని ఇందుకోసం ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైనవారితో ఐజీ గుంజ్యాల్ భేటీ అయ్యారని... ఆ తర్వాత ఇద్దరు అడిషనల్ ఎస్పీలు కూడా వారితో సమావేశమై వారు నిర్వర్తించాల్సిన విధుల గురించి చెప్పారని తెలిపారు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించబడ్డ ఆర్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రభుత్వం వేతనం చెల్లించదని... వారు చేస్తున్నది సామాజిక సేవగానే పరిగణిస్తారని పేర్కొన్నారు.
ఒక్కో ప్రాంతంలో ఆరుగురు ఎస్పీవోలు...
ప్రస్తుతం హరిద్వార్లోని గంగా నది ఘాట్స్,రైల్వే స్టేషన్లు,క్రాసింగ్&డైవర్షన్ పాయింట్స్,పొరుగు జిల్లాల బోర్డర్స్ తదితర ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో దాదాపు ఆరుగురు ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు షిఫ్టుల ప్రకారం పనిచేస్తున్నారు. జితిన్ వేది అనే ఆర్ఎస్ఎస్ వాలంటీర్ మాట్లాడుతూ... ప్రస్తుతం తాను దేవ్పురా చౌక్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పాడు.
హరిద్వార్కు వచ్చే భక్తులతో తాము గౌరవంగా మెలుగుతామని,వారికి సరైన సూచనలు చేస్తామని,ఏదైనా ఓపికగా వివరిస్తామని చెప్పారు. అదే పోలీసులు భక్తులు ఏ చిన్న తప్పు చేసినా ఆగ్రహంతో వారిపై అరుస్తారని పేర్కొన్నారు. సాధారణంగా కుంభమేళా ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. జనవరి మాసం నుంచి ఏప్రిల్ మాసం వరకూ కొనసాగుతుంది. కానీ ఈసారి కరోనా నేపథ్యంలో కేవలం ఏప్రిల్ నెలకే దీన్ని పరిమితం చేశారు.