ఈ ప్రశ్నకు బదులుందా? మన ప్రధాని మోదీ భారతీయుడే అనడానికి రుజువులున్నాయా? ఆర్టీఐ పిటిషన్..
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో దేశం రెండుగా చీలిపోయింది. సీఏఏ వ్యతిరేక నిరసనలు ఒకవైపు.. సీఏఏ అనుకూల ర్యాలీలు మరోవైపు జోరుగా సాగుతున్నాయి. సీఏఏను రద్దు చేయాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసిన 22 ప్రతిపక్ష పార్టీలు.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నాయి. అవసరమైతే రాష్ట్రాలను బైపాస్ చేసైనా చట్టాన్ని ఆన్ లైన్ ద్వారా అమలు చేస్తామని కేంద్రం భీష్మించుకుంది. ఈ గొడవల మధ్యలో ఓ కేరళ వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ సంచలనం రేపుతోంది.
కేరళలోని త్రిసూర్ జిల్లా చలక్కుడికి చెందిన జోస్ కలువేట్టిల్ అనే వ్యక్తి ఈ నెల 13న కేరళ సమాచార కమిషన్ లో ఒక అప్లికేషన్ దాఖలు చేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయుడే అనడానికున్న రుజువులేంటో చూపించాలని కోరాడు. ఈ మేరకు ఈయన అడిగిన ప్రశ్నను.. చలక్కుడి మున్సిపల్ ఆఫీసులోని ఆర్టీఐ సెంటర్ నోటీస్ బోర్డులో ఉంచారు. సంబంధిత అధికారుల నుంచి సమాచారం సేకరిస్తామని మున్సిపల్ అధికారులు జోస్ కు తెలిపారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ లో మతపీడను ఎదుర్కొని ఇండియాకు వచ్చిన ముస్లిమేతర శరణార్థులందరికీ ఎలాంటి పత్రాల అవసరం లేకుండా పౌరసత్వ కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రం సీఏఏను రూపొందించింది. దీంతో భారత పౌరులు నేరుగా ఎఫెక్ట్ ఉండదని కేంద్రం చెబుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల వాదన మరోలా ఉంది. దేశవ్యాప్త ఎన్నార్సీలో ప్రతి ఒక్కరూ తాము భారతీయులేనని సంబంధిత పత్రాలతో నిరూపించుకోవాల్సిఉంటుందని, అలా కాని పక్షంలో వారిని అక్రమవలసదారులుగా గుర్తిస్తారని, ముందే చేసిన సీఏఏ ద్వారా హిందూ, సిక్కు, జైన తదితర మతస్తులకు భారతీయ పౌరసత్వం లభిస్తుందని, ముస్లింలు మాత్రం దేశంలేనివాళ్లవుతారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ రెండు చట్టాల్లో జాతీయత అంశం ప్రధానంగా వినిపిప్తున్న క్రమంలో కేరళ యువకుడి ఆర్టీఐ ప్రశ్నకు ప్రాధాన్యం ఏర్పడింది.