రెండాకుల చిహ్నం లేకుంటే పన్నీర్ కు ఇదే గుర్తు ! గతంలో అమ్మకు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండాకుల చిహ్నం మాకే ఇవ్వాలని ఎన్నికల కమిషన్ కు మనవి చేస్తామని ఆ పార్టీ పన్నీర్ సెల్వం చీలిక వర్గంలోని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాండ్యరాజన్ (పాండియరాజన్) అన్నారు.
చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండాకుల చిహ్నం మాకే వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ రెండాకుల చిహ్నం దక్కని పక్షంలో కోడిపుంజును చిహ్నంగా తీసుకునే కసరత్తుల్లో పన్నీర్ సెల్వం ఉన్నారని పాండ్యరాజన్ వివరించారు.
ఎంజీఆర్ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. ఆ సమయంలో రెండాకుల చిహ్నం ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ వర్గానికి వెళ్లింది. అప్పట్లో అమ్మ జయలలిత కోడిపుంజును చిహ్నంగా తీసుకున్నారు.
ఇప్పుడు శశికళ వర్గానికి రెండాకుల చిహ్నం వెళితే గతంలో అమ్మ జయలలిత ఎంపిక చేసుకున్న కోడిపుంజును చిహ్నంగా తీసుకునే అవకాశం ఉందని పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు. ఇదే సమయంలో శశికళ పదవికి చెక్ పెట్టడానికి పన్నీర్ సెల్వం వర్గీయులు పావులుకదుపుతున్నారు.
శశికళ ఎంపిక చెల్లదని పన్నీర్ సెల్వం వర్గీయులు జాతీయ ఎన్నికల కమిషన్ ముందు మనవి చెయ్యాలని సిద్దం అయ్యారు. ఎలాగైనా శశికళను పదవి నుంచి తప్పించి మళ్లీ తమ వర్గం చేతిలోకి పార్టీని తీసుకోవాలని పన్నీర్ సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు. శశికళ ఎన్నిక పార్టీ నియమాల ప్రకారం చెల్లదు అంటూ మంగళవారం పన్నీర్ సెల్వం వర్గం ఎన్నికల కమిషన్ కు వివరణ ఇస్తూ తన వాదన వినపించనుంది.