అధికార పార్టీలకు భారీ దెబ్బ: ప్రభుత్వ తప్పిదాలా? మోడీ మేనియానా?..
మొత్తం మీద ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోను అధికార పార్టీలకు భారీ షాక్ తగిలింది. అధికార పార్టీలను గద్దె దించుతూ ప్రత్యర్థి పార్టీలకు ఓటర్లు పట్టం కట్టారు.
న్యూఢిల్లీ: మొత్తం మీద ముందుగా ఊహించినట్లుగానే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ హవా కొనసాగింది. అంచనాలకు మించి మరీ ఆ రాష్ట్రంలో బీజేపీ దూసుకెళ్లింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఒకసారి గమనిస్తే.. అన్ని రాష్ట్రాల్లోను అధికార పార్టీలకు ప్రతికూల పవనాలు వీచాయి. అధికార పార్టీలను గద్దె దించుతూ ప్రత్యర్థి పార్టీలకు ఓటర్లు పట్టం కట్టారు.
ఉత్తరప్రదేశ్ లో విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎస్పీ-కాంగ్రెస్ కూటమి బీజేపీ దూకుడుకు ఏమాత్రం కళ్లెం వేయలేకపోయింది. బీజేపీ హవాతో వార్ వన్ సైడ్ అవగా.. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి కనీస పోటి కూడా ఇవ్వలేక చేతులెత్తేశాయి. అదే సమయంలో కచ్చితంగా విజయం సాధించి తీరాల్సిన పరిస్థితిలో బీఎస్పీ మాయావతికి మరోసారి భంగపాటే మిగిలింది.
అఖిలేష్ విఫలం:
అధికార ఎస్పీలో కుటుంబ కలహాలకు తోడు.. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో సీఎం అఖిలేష్ తీరుపై అక్కడి జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తే ఓటర్లను ఎస్పీకి దూరం చేసింది. పలుమార్లు హింసాకాండలు చోటు చేసుకోవడం, మత అసహనం వంటి ఘటనలను అదుపు చేయడంలో అఖిలేష్ పూర్తిగా విఫలమయ్యారు.
పంజాబ్ లో అకాలీ తప్పిదాలు:
ఇక పంజాబ్ విషయానికొస్తే.. మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేయడంలో ప్రకాశ్ బాదల్ సర్కార్ విఫలమైంది. దీనికి తోడు ఆప్ కూడా బరిలో నిలవడంతో ఆ పార్టీకి రావాల్సిన ఓట్లు కాంగ్రెస్-ఆప్ మధ్య చీలిపోయాయి. కాంగ్రెస్ కు గట్టి పోటినిస్తుందనుకున్న ఆప్ కూడా మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది తప్పితే.. ఎక్కడా కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కోలేకపోయింది.
గోవాలో సీఎం సైతం గెలవలేక:
గోవాలో బీజేపీ గెలుస్తుందని భావించినప్పటికీ.. అంచనా తలకిందులైంది. ఏకంగా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ ఎన్నికల్లో మట్టికరిచారు. గోవాలో కాంగ్రెస్ పాగా వేసినట్లుగానే కనిపిస్తోంది. ఇక ఉత్తరాఖండ్ లోను అధికార కాంగ్రెస్ కు భంగపాటు తప్పలేదు. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ తప్పిదాలను అనుకూలంగా మలుచుకోవడంలో బీజేపీ సఫలమైంది.
మణిపూర్ లో ఇరోమ్ షర్మిలకు భంగపాటు:
ఇక ఏళ్ల పాటు దీక్ష కొనసాగించి తన పోరాట పంథాను ఎన్నికల వైపు మళ్లించిన ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలను సైతం అక్కడి ఓటర్లు విస్మరించారు. అధికార కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 25స్థానాల్లో కాంగ్రెస్, 14స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి.
మోడీ మానియా?.. ప్రభుత్వాల తప్పిదమా?
మొత్తం మీద ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోను అధికార పార్టీలకు భారీ షాక్ తగిలింది. అదే సమయంలో యూపీ, ఉత్తరాఖండ్ లలో బీజేపీ పాగా వేయడం వెనుక, ప్రధాని మోడీ మానియాతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలే ప్రధాన కారణంగా ఉన్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.