ఆ నీళ్లు తాగితే డయాబెటిస్ మటుమాయం..!? హర్యానాలో బోరుబావి వద్ద క్యూ కడుతున్న జనం..!
రెవాడీ : ప్రపంచం 5జీ స్పీడుతో దూసుకుపోతోంది. టెక్నాలజీని ఉపయోగించి మనిషి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు. ఇంతగా అభివృద్ధి చెందిన చెందినా మనిషి ఇంకా మూఢ నమ్మకాలను వదలడం లేదు. తాజాగా హర్యానాలో ఓ బోరుబావి నీటిలో ఔషధ గుణాలున్నాయన్న వదంతులు హల్ చల్ చేశారు. సర్వ రోగ నివారిణిలా ఆ నీళ్లు పనిచేస్తున్నాయన్న మాటలు నమ్మిన జనం.. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడికి చేరుకుంటున్నారు.
ఓరి ఈడి ఏషాలో : పగలు టిక్టాక్ వీడియోలు.. రాత్రికి...
డయాబెటిస్ ఫ్రీ వాటర్
హర్యానా రెవాడి జిల్లాలోని గుజరీవాస్ గ్రామం ఈ వింతకు వేదికైంది. ఆ ఊరిలోని ఓ రైతు పొలంలో ఉన్న బోరుబావి నుంచి వస్తున్న నీరు రోగాలను తగ్గిస్తోందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ నీరు తాగితే డయాబెటిస్ మటుమాయం కావడంతో పాటు ఉదర, చర్మ వ్యాధులు తగ్గిపోతాయని జనం నమ్ముతున్నారు. విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ మొదలు రాజస్థాన్ వరకు జనం ఆ నీటి కోసం తరలి వస్తున్నారు.
ఇదీ అసలు కథ
ఔషద గుణాలున్నాయంటూ జనం ఇంత విపరీతంగా నీటి కోసం ఎగుబడటం వెనుక పెద్ద కథే ఉంది. ఈ బోరు బావి ఉన్న పొలం మాండురామ్ది. దాన్ని ఆయన అలీ మహ్మద్ అనే వ్యక్తికి కౌలుకిచ్చాడు. డయాబెటిస్తో బాధపడుతున్న అలీ భార్య కొన్నాళ్ల పాటు ఆ బోరు బావి నీళ్లు తాగడంతో ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఇదే విషయం చుట్టుపక్కలవారికి చెప్పడంతో విషయం ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. ఫేస్బుక్, వాట్సప్లో వైరల్ కావడంతో పొరుగు రాష్ట్రాల నుంచి జనం నీళ్లకోసం గుజరీవాస్కు రావడం మొదలుపెట్టారు.
రూ.50కి లీటర్ నీళ్లు
గుజరీవాస్కు చేరుకునేందుకు లాలాపూర్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆ గ్రామస్తులు కొత్త వ్యాపారం మొదలుపెట్టారు. అక్కడి వరకు వెళ్లలేని వారి నుంచి బాటిల్ సైజును బట్టి రూ. 50 నుంచి రూ. 200 వసూలు చేస్తూ నీళ్లు ఇస్తున్నారు. మరోవైపు నీళ్ల కోసం జనం ఆటోలు, కార్లు, జీపుల్లో తరలి వస్తుండటంతో బోరుబావి పక్కన ఉన్న పొలాల యజమానులకు కొత్త ఐడియా వచ్చింది. తమ పొలాలను పార్కింగ్ ప్రాంతాలుగా దందా మొదలుపెట్టారు. ఒక్కో వాహనానికి రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు.
కమిటీ ఏర్పాటు
నీటికి ఔషధ గుణాలున్న వదంతులు, జనం తండోపతండాలుగా తరలివస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వదంతుల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటైంది. నీటి శాంపిల్స్ను పరీక్షల కోసం పంపగా.. అందులో బ్యాక్టీరియా ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు. పూర్తిస్థాయి ఫలితాలు అందిన అనంతరం కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వనుంది. దాని ఆధారంగా కలెక్టర్ తదుపరి చర్యలు తీసుకోనున్నారు.