అమిత్షా బెంగాల్ టూర్ -బీజేపీలోకి ఓ తృణమూల్ ఎంపీ, 10 మంది ఎమ్మెల్యేలు ?
వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న పశ్చిమెబంగాల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్తో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వేడెక్కిన రాజకీయాలు.. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటనలో మరో మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇవాళ కోల్కతా వచ్చారు. ఆయన బెంగాల్ పర్యటనలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు బీజేపీ బాట పడతారని కాషాయ నేతలు చెబుతున్నారు. వారి అంచనా ప్రకారం ఓ ఎంపీ, పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. మమతపై అసంతృప్తిగా ఉన్న రవాణాశాఖ మంత్రి సువేందు అధికారి ఇప్పటికే పార్టీకి గుడ్బై చెప్పారు. ఆయన తృణమూల్ నేతల బీజేపీ చేరికకు మార్గదర్శం వహిస్తున్నట్లు తెలుస్తోంది. నందిగ్రామ్ నుంచి టీఎంసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సువేందు తూర్పు బెంగాల్లో మంచి పట్టున్న నేత. ఆయన రాకతో బీజేపీ సమీకరణాలు కూడా మారనున్నాయి.
ఇవాళ బెంగాల్ పర్యటనకు వచ్చిన అమిత్షా.. మిడ్నాపూర్ చేరుకున్నారు. మిడ్నాపూర్ కాలేజ్ గ్రౌండ్కు షా కాన్వాయ్ చేరుకోగానే, బీజేపీ కార్యకర్తలు జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై నినాదాలతో హోరెత్తించారు. స్ధానిక సిద్ధేశ్వరి మాత గుడిలో అమిత్ షా పూజలు నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు ఖుదీరాం బోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పశ్చిమ మిడ్నాపూర్లోని ఆయన వారసుల ఇంటికి వెళ్లనున్నారు.