బీజేపీ చేతుల్లోకి పుదుచ్చేరి - జగన్ ఆప్తుడికి సీఎం ఆఫర్ ? సంచలనాలు తప్పవన్న మల్లాడి
గతంలో ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బీజేపీ క్రమంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన కూడా సత్తా చాటుకుంటోంది. అయితే దక్షిణాదిన బీజేపీకి మింగుడుపడని కేంద్రపాలిత ప్రాంతంగా పుదుచ్చేరి నిలిచింది. దీనికి కారణం అక్కడి ద్రవిడ రాజకీయాల వాసనలతో పాటు స్ధానిక సమీకరణాలే. దీంతో ప్రధాని మోడీ సైతం కశ్మీర్లో కూడా ఎన్నికలు పెట్టాం కానీ పుదుచ్చేరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామంటూ వాపోయారు. ఇప్పుడు ఆ లోటును పూడ్చుకునేందుకు బీజేపీ శరవేగంగా అడుగులేస్తోంది. అన్నీ కలిసొస్తే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పుదుచ్చేరిలో పాగా వేసేందుకు బీజేపీ భారీ స్కెచ్ రెడీ చేసింది.
ఎన్నికల వేళ మారుతున్న పుదుచ్చేరి రాజకీయం
తమిళనాడుకు పొరుగున ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. అయితే ఇందులో భాగంగా ఉన్నప్పటికీ ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పక్కనే ఉండిపోయిన అసెంబ్లీ నియోజకవర్గం యానాం. పుదుచ్చేరికి దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న యానాం.. ఇక్కడి అసెంబ్లీలో రాజకీయాలను మాత్రం ఇన్నేళ్లుగా శాసిస్తూ వస్తోంది. ఇందుకు కారణం కరడుగట్టిన కాంగ్రెస్ వాది, పాతికేళ్లుగా యానాం ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా ఉన్న మల్లాడి కృష్ణారావే. కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న పుదుచ్చేరిలో రాజకీయం మాత్రం తొలిసారిగా బీజేపీ వైపు మొగ్గేలా కనిపిస్తోంది.
బీజేపీవైపే మల్లాడి అడుగులు ?
పాతికేళ్లుగా యానాం ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు రాష్ట్రమంత్రిగా పనిచేసిన మల్లాడి కృష్ణారావు ఆ ప్రాంతానికి ఏమీ చేయలేకపోయానంటూ తరచూ వాపోతుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నప్పటికీ యానాం అభివృద్ధికి బాటలు పడకపోవడం ఆయన్ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. దీంతో రాజకీయాల నుంచే తప్పుకుంటానని ప్రకటించి షాకిచ్చిన మల్లాడి కృష్ణారావు ఇప్పుడు రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదులుకున్న మల్లాడి ఇప్పుడు భవిష్యత్ వ్యూహాల్లో మునిగితేలుతున్నారు. చివరికి ఆయన అడుగులు బీజేపీవైపే పడేలా కనిపిస్తున్నాయి.
జగన్ ఆప్తుడికి బీజేపీ ఆఫర్ ఇదేనా ?
తాజాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన బీసీల సభలో పాల్గొన్న మల్లాడి కృష్ణారావు, జగన్ కోరితే ప్రస్తుతం పుదుచ్చేరిలో చేస్తున్న రాజకీయాల్ని వదిలిపెట్టి ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించేశారు. అయితే ఈ ప్రకటనతో జగన్ పిలిచి పెద్దపీట వేస్తారని భావించినా ఆ దిశగా సంకేతాలు లేకపోవడంతో మల్లాడి మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన ఎప్పటినుంచో కోరుకుంటున్న ఎమ్మెల్యే, మంత్రి పదవులను మించిన పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అంటే పుదుచ్చేరి సీఎం పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్నట్లు అర్దమవుతోంది. బీజేపీ నుంచి ఈ మేరకు హామీ లభించిన తర్వాతే ఆయన కాంగ్రెస్లో మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి బయటికి చెప్పకపోయినా త్వరలో మల్లాడి అడుగులు అటే అన్న ప్రచారం సాగుతోంది. పుదుచ్చేరిలో సీఎం నారాయణ స్వామి తర్వాత సీనియర్ నేతగా ఉండటం కూడా ఆయనకు కలిసి వస్తోంది.
త్వరలో సంచలనాలు అంటూ మల్లాడి సంకేతాలు
యానాం అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, రెండు వారాల్లో సంచలనాలు చూస్తారంటూ తాజాగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మల్లాడి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు అంతే సంచలనం రేపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదులుకున్న మల్లాడి భవిష్యత్ కార్యాచరణపై తీవ్ర స్ధాయిలో చర్చ జరుగుతున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యల బట్టి చూసినా ఆయన కాషాయ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుదుచ్చేరి రాజకీయాల్లో అంతకు మించిన సంచలనం కూడా ఉండకపోవచ్చు. పాతికేళ్లుగా పచ్చి కాంగ్రెస్ వాదిగా పేరు తెచ్చుకున్న మల్లాడి కృష్ణారావు బీజేపీ తరఫున సీఎం అభ్యర్ధి అయితే పుదుచ్చేరి రాజకీయాల్లో పెను సంచలనంగా మారనుంది.
కిరణ్ బేడీ తొలగింపు అందులో భాగమేనా ?
పుదుచ్చేరిలో నాలుగేళ్లుగా లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న కిరణ్ బేడీని తాజాగా కేంద్రం ఆ పదవి నుంచి తప్పించింది. అయితే ఇందుకు ఎలాంటి కారణాలు కూడా పేర్కొనలేదు. అంతే కాదు ఆమె స్ధానంలో ఎక్కడో తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళనాడుకు చెందిన మాజీ బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో కిరణ్బేడీ తొలగింపును కాంగ్రెస్ ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు తాజాగా రాజీనామాలు చేసిన మల్లాడి కృష్ణారావు వంటి వారు కూడా స్వాగతిస్తున్నారు. అయితే రాజీనామాలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోరిక మీదే ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ నాలుగేళ్లుగా కిరణ్బేడీతో పొసగడం లేదు. అయినా ఇప్పుడు మాత్రమే ఆమెను తప్పించడం వెనుక బీజేపీ వ్యూహమే ఉందని అర్ధమవుతోంది.