వదంతులొద్దు: అంబరీష్పై సుమలత, రమ్య పరామర్శ
బెంగళూరు: కన్నడ నటుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ మంత్రి అంబరీష్ ఆరోగ్యంగానే ఉన్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆయన భార్య సుమలత తెలిపారు. ఆయన ఆరోగ్యం విషమించిందని వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. ప్రస్తుతం శ్వాస కోశ సమస్యకు అంబరీష్ చికిత్స పొందుతున్నారని, బెంగళూరులోని ప్రయివేటు ఆసుపత్రి వైద్యులు చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు త్వరలోనే అంబరీష్ను జనరల్ వార్డుకు మారుస్తామని వైద్యులు చెప్పారన్నారు. ఐసియూలో వెంటిలేటర్తో ఉన్నందున మాట్లాడటానికి వీలుకావడం లేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అభిమానుల ఆశీర్వాదం ఉందని, ఆయనకు ఏమీ కాదన్నారు. దయచేసి తమకు ప్రైవసీ ఇవ్వాలని, సహకరించాలని సుమలత కోరారు.
కాగా, అంబరీష్ను మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కన్నడ నటుడు దర్శన్, తెలుగు నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు విష్ణు, కన్నడ నటి, శాసనసభ్యురాలు రమ్యలు, నటుడు ఉపేంద్రలు పరామర్శించారు. రెండు రోజుల క్రితం అంబరీష్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు.
అంబరీష్ను పరామర్శించిన అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ.. అంబరీష్, తాను 37 ఏళ్లుగా స్నేహితులమని చెప్పారు. అందరి ఆశీస్సులతో ఆయన కోలుకుంటున్నారని చెప్పారు. టైగర్లా ఆయన బయటకు వస్తారని, ఆరోగ్యంగా ఉన్నారన్నారు. మరోవైపు అంబరీష్ కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.