పెళ్లయిన రెండు రోజులకే!: భార్య ఇచ్చిన షాక్కు భర్త దిమ్మతిరిగింది..
భర్త నచ్చలేదో.. లేక ముందస్తు పథకం ప్రకారమే చేశారో తెలియదు గానీ మొత్తానికి 'డాలీకి డోలి' సినిమాను తలపించే ఘటన ఒకటి చోటు చేసుకుంది. పెళ్లయిన రెండు రోజులకే భర్తను బురిడీ కొట్టించి నగలతో ఉడాయించిందో యువతి
డెహ్రాడూన్: భర్త నచ్చలేదో.. లేక ముందస్తు పథకం ప్రకారమే చేశారో తెలియదు గానీ మొత్తానికి 'డాలీకి డోలి' సినిమాను తలపించే ఘటన ఒకటి చోటు చేసుకుంది. పెళ్లయిన రెండు రోజులకే భర్తను బురిడీ కొట్టించి నగలతో ఉడాయించిందో యువతి.
ఉత్తరాఖండ్ లోని రూర్కీ జిల్లా కువాన్ హెది గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అజయ్ త్యాగి కుటుంబానికి ఇటీవల ఓ మహిళ పరిచయమైంది. ఆమె 'కాయ' పేరిట ఓ యువతిని వారికి పరిచయం చేసింది. అజయ్ కి కాయ చక్కని జోడీ అని భావించిన కుటుంబ సభ్యులు ఈ నెల 22న వారి పెళ్లి చేశారు.
రెండు రోజుల పాటు అంతా సజావుగానే సాగింది. శుక్రవారం ఒక్కసారిగా నూతన వధువు అస్వస్థతకు గురైంది. దీంతో అజయ్ ఆమెను సమీపంలోని క్లినిక్ కు తీసుకెళ్లాడు. దీంతో డాక్టర్ కొన్ని మందులు రాసివ్వడంతో అవి తీసుకున్నాడు.
ఆ తర్వాత తనకు చికెన్ తినాలనుందని వధువు అజయ్ తో చెప్పింది. సమీపంలో నాన్ వెజ్ హోటల్స్ ఏమి అందుబాటులో లేకపోవడంతో పుర్కాజీ పట్టణానికి ఆమెను తీసుకెళ్లాడు. చికెన్ తర్వాత కూల్ డ్రింక్ కావాలనడంతో తీసుకురావడానికి అజయ్ వెళ్లాడు.
కూల్ డ్రింక్ తీసుకుని వచ్చిన అజయ్.. యువతి ఎక్కడికెళ్లిందో తెలియక కంగారుపడ్డాడు. పలుచోట్ల వెతికి ఇంటికెళ్లేసరికి.. ఆమెకు పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారు, వెండి ఆభరణాలను వెంట తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో మోసపోయానని గ్రహించిన అజయ్.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.