రాహుల్.. నీకు కొత్తిమీరకు,మెంతికి తేడా తెలుసా... గుజరాత్ సీఎం ఎద్దేవా...
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. భారత్ బంద్కు మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అసలు రాహుల్ గాంధీకి కొత్తిమీరకు,మెంతికి తేడా తెలుసా అని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి వ్యవసాయ చట్టాలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం(డిసెంబర్ 8) గుజరాత్లోని మెహసానాలో నర్మదా ఆధారిత నీటి సరఫరా పథకానికి శిలాఫలకం వేసిన సందర్భంగా రూపానీ మాట్లాడారు.
'ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని,విపక్ష పార్టీలను తిరస్కరించారు. అయినప్పటికీ రైతులను ముందుపెట్టి ఉద్యమం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నేను రాహుల్ గాంధీని ఓ విషయం అడగదలుచుకున్నాను. కొత్తిమీరకు,మెంతికి తేడా ఏంటి. తెలిస్తే ఆయన సమాధానం చెప్పాలి. ఆయన తెలివేంటో అందరికీ తెలిసిందే..' అంటూ రూపానీ రాహుల్ను విమర్శించారు.
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో వాళ్ల పార్టీ మేనిఫెస్టోలోనూ ఈ చట్టాలను పేర్కొందన్నారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చిత్తశుద్దితో పనిచేస్తున్నారని చెప్పారు. రైతుల పేరు మీద రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్... సాగునీరు,విద్యుత్,విత్తనాలు,ఎరువులు,కనీస మద్దతు ధర... ఇలా ఏ విషయంలోనూ ఏమీ చేయలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే వీటి గురించి పట్టించుకుంటోందన్నారు.
గతంలో గుజరాత్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాలపై 18శాతం వడ్డీ వసూలు చేస్తే... ఇప్పటి బీజేపీ ప్రభుత్వం జీరో శాతం వడ్డీకే రైతులకు రుణాలు అందిస్తోందన్నారు. కాబట్టి రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ది గల ప్రభుత్వం బీజేపీదేనని పేర్కొన్నారు.
కాగా,కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతులు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ భారత్ బంద్కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని 18 రాజకీయ పార్టీలు బంద్కు మద్దతునిచ్చాయి.