రూ.15 కోసం దళిత దంపతుల దారుణ హత్య
న్యూఢిల్లీ : పదికి.. పరకకు కూడా దేశంలో హత్యలు చోటు చేసుకుంటున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతకొద్దిరోజులుగా దళితులపై దాడులు దేశంలో తీవ్ర చర్చనీయాంశం కాగా.. తాజాగా కేవలం రూ.15 తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ దళిత దంపతులను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురికి చెందిన ఓ షాపు యజమాని.
నిందితుడిని అశోక్ గా గుర్తించిన పోలీసులు.. మృతి చెందిన భార్య భర్తల్లో.. భర్తను భరత్ సింగ్ గా గుర్తించారు. ఘటనకు సంబంధించిన తెలియవస్తున్న వివరాలను పరిశీలిస్తే..! షాపు యజమాని అశోక్ వద్ద భరత్ సింగ్ దంపతులు రూ.15 బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేసి బకాయి పడ్డారు. తిరిగి చెల్లించడంలో జాప్యం జరుగుతుండడంతో.. గురువారం నాడు కూలీ పని కోసం బయటకు వెళుతున్న సందర్బంలో భరత్ సింగ్ దంపతులకు ఎదురుపడ్డ అశోక్ డబ్బుల గురించి గట్టిగా నిలదీశాడు.
దీంతో తాము పనికి వెళుతున్నామని పని నుంచి తిరిగొచ్చాక డబ్బు చెల్లిస్తామని చెప్పాడు భరత్ సింగ్. అయితే భరత్ సింగ్ సమాధానంతో సంతృప్తి చెందిన ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. తన వద్ద ఉన్న కొడవలితో దంపతులిద్దరిని హత్య చేశాడు అశోక్. అనంతరం అక్కడి నుంచి పరారవబోతుండగా స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అశోక్ హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.