ఉద్యోగాలకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయంటే నిరుద్యోగం పెరుగుతోందని కాదు: పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో సరిపడా ఉద్యోగాలు ఇచ్చిందని అయితే దీనికి సంబంధించిన సమాచారం ప్రజలకు చేరవేయడంలో వ్యవస్థ విఫలమైందని కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, మానవవనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్లు చెప్పారు. ఓ కార్యక్రమంలో ఉద్యోగాలపై మాట్లాడుతూ వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకే ఉద్యోగం కోసం పెద్ద సంఖ్యలో యువత దరఖాస్తు చేసుకుంటుందని అలా అని ఇతర రంగాల్లో ఉద్యోగాలు లేవని కాదని పీయుష్ గోయల్ వెల్లడించారు. ఒకే ఉద్యోగానికి పరిమితమవడం వల్ల ఇతర రంగాల్లో ఉద్యోగాలు లేవని భావిస్తున్నారని మంత్రులు వెల్లడించారు,
పీయూష్ గోయల్ సర్వే: బీజేపీకి 297 నుంచి 303 సీట్లు ఖాయం, 2014లో అదే జరిగింది
రైల్వేకు సంబంధించిన ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. రైల్వే సంస్థ కొన్ని పోస్టులను విడుదల చేసిందని అయితే వీటికి 15 మిలియన్ దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఈ సమాచారాన్ని వ్యవస్థలు చూపిస్తూ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందనే తప్పుడు సంకేతాలను పంపుతున్నారని ఆయన చెప్పారు. అంతేకాదు భారతీయ ఉద్యోగుల్లో ఒక భావన ఉందని చెప్పిన ఆయన... ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితం సెటిల్ అయినట్లే అని, ఒకవేళ తాము తప్పు చేసిన తమ యూనియన్లు చూసుకుంటారనే భావన వారిలో ఉందని పీయుష్ గోయల్ చెప్పారు. కొత్త ఉద్యోగాలు ఇతర రంగాల్లో ఉన్నాయని... కొత్త రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయని మంత్రి వివరించారు.
ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు రావాలని అప్గ్రేడ్ కావాలని పీయూష్ గోయల్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాల పెంపులో కూడా మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇతర ప్రాధాన్యత లేని రంగాల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయనే విషయాన్ని వ్యవస్థలు చూపించడం లేదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు క్రేజ్ ఎంత ఉందో అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా స్వీపర్ పోస్టుకు ఎందుకు దరఖాస్తు చేస్తున్నారనేది ముందుగా విశ్లేషించాల్సి ఉందన్నారు. అంతేకాదు ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగమే ఎందుకు కావాలనుకుంటున్నాడో అనేదానిపై కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పీయూష్ గోయల్ అన్నారు.