భారత్ లో ఏకే-47 రైఫిల్స్ తయారీ ప్లాంట్!
న్యూఢిల్లీ: శక్తివంతమైన ఏకే-47 రైఫిల్స్ భారత్ లో తయారు చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు. రష్యాకు చెందిన ఏకే-47 రైఫిల్స్ తయారి సంస్థ కలప్ని కోవ్ భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో ఇక్కడ రైఫిల్స్ తయారు చేసే ప్రాజెక్టు సంస్థను ప్రారంభించడానికి సిద్దం అవుతున్నది.
ఈ విషయంపై భారతీయ కంపెనీలతో ఇప్పటికే చర్చలు జరిపింది. స్థానిక భాగస్వామ్యంతో సాంకేతికతను పంచుకునేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. అయితే చర్చలు సానుకూలంగా ఉన్నా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
2008 నుంచే భారత్ కు చెందిన కంపెనీలు ఏకే-47 రైఫిల్స్ తయారు చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఇంత కాలానికి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని కలప్ని కోవ్ కంసర్న్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలెక్సీ కృవోరుచ్కో అంటున్నారు.
అయితే తాము ఇప్పటి వరకు భారత్ రక్షణ శాఖతో చర్చలు జరపలేదని ఆయన చెప్పారు. భారతదేశంలో ఈ ప్రాజెక్టు అమలు చేసి ఏడాదికి కనీసం 50 వేల ఏకే-47 రైఫిల్స్ తయారు చెయ్యాలని దృష్టి సారిస్తున్నట్లు ఆయన వివరించారు. మొత్తం మీద ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే భారత్ మరో అడుగు ముందుకు వేసినట్లు అవుతుంది.