పాకిస్తాన్కు రష్యా 'భారీ' ఝలక్: అందుకేనని భారత్కు వివరణ
గోవా: పాకిస్తాన్కు రష్యా గట్టి ఝలక్ ఇచ్చింది. రష్యా సేనలతో కలిసి ఇటీవల సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడం, ఆ దేశం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించడంతో పాటు సైనిక సంబంధాలు మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్ ఆశించింది. కానీ నిరాశే ఎదురైంది.
పాకిస్తాన్తో మిలిటరీ సంబంధిత ఒప్పందాలు చేసుకోమని, ఏ ఒప్పందాల పైన సంతకం చేసే ఆలోచన లేదని రష్యా పాక్కు ఝలక్ ఇచ్చింది. గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన రష్యా రోస్టెక్ కార్పోరేషన్ సీఈవో సెర్జీ చెమిజోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆధునిక హెలికాప్టర్లు కానీ మిలిటరీ హెలికాప్టర్లు కానీ పాకిస్తాన్కు అమ్మే యోచన లేదని తేల్చి చెప్పారు. రవాణాకు సంబంధించి పాకిస్తాన్కు కొన్ని హెలికాప్టర్లను సరఫరా చేశామని, ఈ ఒప్పందం ముగిసిందన్నారు. ఇక పైన ఆదేశంతో ఎలాంటి మిలిటరీ సంబంధ ఒప్పందాలు చేసుకునేది లేదన్నారు.
ఇటీవల పాకిస్తాన్లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించడం పైన కూడా చెమిజోవ్ స్పందించారు. ఆ దేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భాగగా విన్యాసాలు నిర్వహించామన్నారు. అంతే కానీ భారత్ను లక్ష్యంగా చేసుకొని నిర్వహించలేదని చెప్పారు. భారత్తో రష్యా బంధం ఎప్పుడూ బలోపేతంగా ఉంటుందన్నారు. భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడతాయన్నారు.
కాగా, నాగ్పుర్ - సికింద్రాబాద్ మార్గంలోని రైళ్ల వేగం పెంపుపై అధ్యయనం చేసేందుకు రష్యాతో భారత్ చేతులు కలిపింది. ఈ మార్గంలోని రైళ్ల వేగాన్ని గంటకు 200 కి.మీ.కు పెంచేందుకు గల సాధ్యాసాధ్యాలపై రెండు దేశాల రైల్వే సంస్థలు కలిసి అధ్యయనం చేయనున్నాయి. శనివారం గోవాలో ఈ మేరకు ఒడంబడిక కుదుర్చుకున్నాయి.
ఈ హైస్పీడ్ రైళ్ల ప్రాజెక్టును భారత్, రష్యా సంయుక్తంగా చేపట్టబోతున్నాయి. గతేడాది ప్రధాని మోడీ రష్యాలో పర్యటించిన సందర్భంగా రెండు దేశాల రైల్వే సంస్థల మధ్య సాంకేతిక సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదిరింది.
రైల్వే మార్గాల అధునికీకరణ, రైళ్ల వేగం పెంపు, అధునాతన నియంత్రణ, భద్రత వ్యవస్థల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి సహకరించుకునేందుకు రెండు దేశాలు అంగీకరించుకున్నాయి. ప్రధాని మోడీ,రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో ఇరు దేశాల మధ్య 16 ఒప్పందాలు జరిగాయి.