రాఫెల్ డీల్ కంటే ముందు రిలయన్స్ డిఫెన్స్తో ఒప్పందానికి నో చెప్పిన రష్యా
ఢిల్లీ: దేశంలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఎన్డీఏ సర్కార్ తప్పులను వెతికి మరీ బయటపెడుతోంది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెబుతున్న బీజేపీ...రాఫెల్ డీల్పై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అంతేకాదు తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో కూడా ప్రధాన అంశంగా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో గోల్మాల్ జరిగిందని చెబుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాఫెల్ ఒప్పందంలో భాగంగా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పేందుకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు తయారవుతోంది.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. అంతకుముందు భారత్కు డిఫెన్స్ పార్ట్నర్గా ఉన్న రష్యా నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్ట్ చేజిక్కించుకునేందుకు రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ప్రయత్నించింది. అయితే కొన్ని కారణాల చేత ఆ కాంట్రాక్ట్ దక్కించుకోవడంలో విఫలమైంది.
కాంట్రాక్టుల కోసం రష్యాకు అనిల్ అంబానీ
ఫ్రాన్స్లా కాకుండా రష్యా భారత ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో జతకట్టి ఒక బిలియన్ డాలర్లు విలువ చేసే కమావ్ KA-226 తేలికపాటి హెలికాఫ్టర్ల తయారీకి ఆసక్తి కనబర్చింది. 2015 ఏప్రిల్లో తొలిసారిగా రాఫెల్ ఒప్పందంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పారిస్కు వెళ్లారు. ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్లో రష్యా రాజధాని మాస్కోకు ప్రధాని వెళ్లారు. ఆ సమయంలో అంబానీ కూడా మాస్కోలో ప్రధాని సమావేశంలో కనిపించారు. అప్పటికే అనిల్ అంబానీ స్థాపించిన డిఫెన్స్ కంపెనీకి కొన్ని కాంట్రాక్ట్లు తెచ్చుకోవడానికే అక్కడికి వెళ్లారు.
హెచ్ఏఎల్తోనే జతకడతామన్న రష్యా రక్షణశాఖ
కాంట్రాక్ట్ కుదుర్చుకునేందుకు వెళ్లిన అనిల్ అంబానీ... తొలి కాంట్రాక్ట్గా కమావ్ డీల్ను ఓకే చేయించుకున్నారు. ఇక రష్యాతోనే రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుందామని రిలయన్స్ డిఫెన్స్ సంస్థ భావించింది. అయితే రష్యా మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలతోనే భాగస్వామ్యం చేసేందుకు మొగ్గు చూపింది. ఇందులో భాగంగానే హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రష్యా జతకట్టింది. అప్పటికే సుఖోయ్ విమానాలు అక్కడ తయారీ అవుతుండటంతో రష్యా హెచ్ఏఎల్తోనే కలిసి వెళ్లాలని భావించింది. ఒక వేళ ప్రైవేట్ కంపెనీలతో రష్యా జతకట్టాలంటే అది ప్రభుత్వం గుర్తింపు పొందినదై ఉండాలని రష్యా మెలిక పెట్టింది. అయితే రిలయన్స్ డిఫెన్స్ ప్రభుత్వంచే గుర్తింపు పొందలేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలకు గుర్తింపు ఇవ్వడమనేది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే 2015 డిసెంబర్లో ఒప్పందం జరగకముందే రిలయన్స్ డిఫెన్స్తో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత రక్షణశాఖకు సమాచారం ఇచ్చింది. కానీ హెచ్ఏఎల్తో జతకట్టాక ఈ మాట మరుగున పడింది. అదే పర్యటన సందర్భంగా, భారతీయ నావికా దళానికి చెందిన నాలుగు నౌకలను 2.5 బిలియన్ డాలర్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు రెండు ప్రభుత్వాలు అంగీకరించాయి.
యుద్ధ నౌకల నిర్మాణం కోసం యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పోరేషన్తో చర్చలు
భారత దేశంలో యుద్ధ నౌకలను నిర్మాణం చేసేందుకు రష్యా యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ సంస్థ తమతో జతకట్టాలని రిలయన్స్ ఢిఫెన్స్ కంపెనీ చర్చలు ప్రారంభించింది. అప్పటికే యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ సంస్థ ఉక్రెయిన్ కంపెనీతో యుద్ధనౌకకు కావాల్సిన ఇంజిన్ తయారీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ డిఫెన్స్ కంపెనీతో కూడా యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే బిడ్డింగ్లో పోటీ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఆ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇందు కోసం ప్రభుత్వ సంస్థ అయిన గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ను యఎస్సీకి అప్పజెప్పింది భారత సర్కార్. అయితే ఈ ఒప్పందం ఇంకా అధికారికంగా జరగలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే నెలలో భారత్లో పర్యటిస్తారు. ఆ సందర్భంగా దీనిపై ఒక అధికారిక ఒప్పందానికి వచ్చే అవకాశముంది.
రష్యాతో విఫలం..ఫ్రాన్స్తో విజయం
ఇలా ఒక్కటి కాదు రష్యాతో రక్షణ రంగంలో భాగస్వామ్యం అవుదామని ప్రయత్నించిన అనిల్ అంబానీకి చెందిన సంస్థ రియలన్స్ డిఫెన్స్ ప్రయత్నాలన్నీ గండికొట్టాయి. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్కటి సక్సెస్ కాలేదు. డిఫెన్స్ సంస్థ స్థాపించినప్పటి నుంచీ అనిల్ అంబానీకి అన్నీ ఎదురు దెబ్బలే తగలడం విశేషం. ఇక తొలి సక్సెస్ అందుకున్నది మాత్రం అక్టోబర్ 2016లో. ఫ్రాన్స్ విమానాయాన రంగంలో ప్రముఖ సంస్థగా పేరొందిన దసాల్ట్ ఏవియేషన్తో రాఫెల్ కాంట్రాక్టులో భాగంగా భాగస్వామ్యం అవుతున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ ప్రకటించింది.