పాక్-భారత్ ఉద్రిక్తత: మీ వెంట మేమున్నాం... మోడీకి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఫోన్
న్యూఢిల్లీ: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. పుల్వామా దాడుల నేపథ్యంలో సంఘీభావం తెలిపారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్ వెంట రష్యా ఉంటుందని హామీ ఇచ్చారు. పుల్వామా దాడి నేపథ్యంలో రష్యా ప్రజల తరఫున కూడా సంఘీభావం తెలిపారు.
పుతిన్కు మోడీ థ్యాంక్స్
తీవ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉన్నందుకు రష్యాకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా, భారత్ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చేసిన దాడులను వివరించారు. సరిహద్దుల్లో భారత ప్రయోజనాలు కాపాడేందుకు, తీవ్రవాదంపై తమ పోరాటానికి అండగా రష్యా నిలవడంపై మోడీ థ్యాంక్స్ తెలిపారు. తీవ్రాదంపై పోరులో ద్వైపాక్షిక సహకారానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. రష్యాను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామిగా చెప్పారు.
మోడీకి ఆహ్వానం
రెండు దేశాల మధ్య (రష్యా, భారత్) మధ్య పెరుగుతున్న సహకారం తమ మధ్య బంధాన్ని మరింత దృఢంగా చేస్తుందని, ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో వ్లాడివోస్కోట్లో జరగనున్న ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంకు ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి ఆహ్వానం పలికారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోడీ స్వాగతించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక సహకారాన్ని గుర్తు చేశారు.
పాక్పై నలువైపులా ఒత్తిళ్లు
కాగా, భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముగింపు దశకు వచ్చాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గురువారం మధ్యాహ్నం వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో భేటీ అనంతరం వ్యాఖ్యానించారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఓ సానుకూల వార్త తెలిసిందని వ్యాఖ్యానించారు. ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ను తాము శుక్రవారం విడుదల చేస్తామని ప్రకటించింది. దీంతో పాక్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వెనుక అమెరికా ఒత్తిడి కూడా ఓ కారణమై ఉంటుందని అంటున్నారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులపై డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలో మరో విషయం కూడా ఉంది. ఇందులో అమెరికా కూడా జోక్యం చేసుకుందన్నారు. భారత్, పాక్ మధ్య కొనసాగుతున్న పరిస్థితులను ఆపడానికి ప్రయత్నిస్తున్నామని, ఇరు దేశాలు ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ప్రయత్నాలు జరుపుతున్నామని తెలిపింది. పాక్పై అమెరికా ప్రభావం బాగానే పడి ఉంటుందని అంటున్నారు. దీంతో పాటు ఐక్యరాజ్య సమితి జపాన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, యూకే వంటి పలు దేశాలు చేసిన ప్రకటనలు పాక్పై మరింత ఒత్తిడిని పెంచాయి. జెనీవా ఒప్పందం గురించి భారత్ గుర్తు చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాక్ వెనక్కి తగ్గింది.