డిఫెక్స్పోలో భారత్-రష్యన్ హెలికాప్టర్లు: నిర్వహణపై చర్చ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మిలిటరీ అండ్ టెక్నికల్ ఎగ్జిబిషన్ డిఫెన్స్ ఎక్స్పో 2018 నేపథ్యంలో రష్యన్ హెలికాప్టర్స్ హోల్డింగ్ కంపెనీ(రోస్టెక్ స్టేట్ కార్పొరేషన్లో భాగం) భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న హెలికాప్టర్ల నిర్వహణ(సేల్స్ సపోర్ట్) విషయంపై చర్చలు జరుపుతోంది.
తేలికపాటి ఎంఐ-817 రకం హెలికాప్టర్లు, అలాగే భారీ ఎంఐ-26, అటాక్ ఎంఐ-25, షిప్ బేస్డ్ కేఏ-25, కేఏ-28, కేఏ-31 హెలికాప్టర్లు భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రష్యాకు చెందిన మొత్తం 400 యూనిట్ల వరకు భారతదేశంలో పనిచేస్తున్నాయి.
తేలికపాటి కేఏ-226టీ హెలికాప్టర్ను భారత్, రష్యా సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. ఇందులో ఎంఐ 171ఏ2 హెలికాప్టర్ కూడా కన్ఫిగర్ చేయబడుతోంది. వీటిని డిఫెక్సో 2018లో ప్రదర్శించనున్నారు. ఇప్పుడు, ఇంతకుముందు ఎగుమతి చేసిన హెలికాప్టర్ల నిర్వహణ బాధ్యతను కూడా రష్యన్ కంపెనీయే తీసుకునేందుకు ఇప్పుడు చర్చలు సాగుతున్నాయి. దీనికి సంబంధించి పలు ఒప్పందాలు కుదరాల్సి ఉంది.
కాగా, 10వ డిఫెన్స్ ఎక్స్పో ఏప్రిల్ 11 నుంచి 14 వరకు చెన్నైలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 12న ప్రారంభించనున్నారు. నాలుగు రోజులు జరిగే ఈ ప్రదర్శనలో భారత భద్రతా దళాల శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ప్రదర్శనలో మరో 47దేశాలు కూడా పాల్గొననున్నాయి.