2020 జల్లికట్టు క్రీడలకు రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆడతారా లేక వీక్షిస్తారా..?
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వతహాగా ఓ మంచి బాడీ బిల్డర్. లేటు వయసులో కూడా ఆయన కండలు తిరిగిన వీరుడిలా కనిపిస్తారు. తన ఆరోగ్యంపై అంత శ్రద్ధ తీసుకుంటారు. పుతిన్ గేమ్స్ను కూడా చాలా ఎంజాయ్ చేస్తారు.. అదే సమయంలో వీలు చిక్కినప్పుడల్లా స్పోర్ట్స్ ఆడతారు. 2020 జనవరిలో పుతిన్ భారత్కు రానున్నారు. ఆ సమయంలో ఆయనలోని అలంగనల్లూర్లో జరిగే జల్లికట్టు క్రీడను వీక్షించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారని సమాచారం.
సంక్రాంతి సందర్భంగా జల్లికట్టు పోటీలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ పోటీలు కొన్ని శతాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. ఒక ఎద్దును గుంపుగా ఉన్న మనుషులపైకి వదిలేస్తారు. మదమెక్కిన ఆ ఎద్దు కొమ్మలను విరిచి ఎవరైతే దాన్ని నియంత్రిస్తారో అతన్ని విజేతగా ప్రకటిస్తారు. జల్లికట్టుకు మదురై సమీపంలోని అలంగనల్లూర్ గ్రామం చాలా ఫేమస్. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలసంఖ్యలో ఈ క్రీడను చూసేందుకు అలంగనల్లూరుకు చేరుకుంటారు.
ఇక విదేశాల నుంచి కూడా ఔత్సాహికులు ఇక్కడకు వస్తుంటారు. అయితే ఈ సారి జల్లికట్టు క్రీడలకు మాత్రం ప్రత్యేక అతిథిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరుకానున్నారు. అయితే పుతిన్ రాకపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని అన్నారు మదురై జిల్లాకు చెందిన మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్.
కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ జల్లికట్టు క్రీడలో పాల్గొన్న పోటీదారులు చాలామంది మృతి చెందారు. దీంతో సుప్రీంకోర్టులో ఈ క్రీడపై నిషేధం విధించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాదు ఒక జంతువును హింసించడం కూడా తప్పే అవుతుందని కొందరు జంతుప్రేమికులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తమ సంస్కృతి లో జల్లికట్టు ఒక భాగమని చాలామంది వాదించారు. అయితే సుప్రీం కోర్టు మాత్రం క్రీడను నిషేధించాలంటూ తీర్పు ఇవ్వడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. మెరీనా బీచ్లో ప్రారంభమైన నిరసనలు తమిళనాట మొత్తం వ్యాపించాయి. ఇక నిరసనల పర్వం పెరిగిపోతుండటంతో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు క్రీడ యథావిధిగా కొనసాగుతుందని ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.