ప్రద్యుమ్న హత్య కేసు: నిందితుడికి బెయిల్ తిరస్కరణ
గుర్గావ్: రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రద్యుమ్న అనే విద్యార్థిని హత్య చేసిన కేసులో 16ఏళ్ల నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు సెషన్ కోర్టు నిరాకరించింది. స్కూల్ ఆవరణలోనే బాలుడ్ని హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
ప్రద్యుమ్నకేసులో ట్విస్ట్: ఆ నిందితుడు వయోజనుడే: సమ్మతించిన కోర్టు
జనవరి 6న జడ్జీ జస్బీర్ సింగ్ కుందు నిందిత యువకుడి బెయిల్ దరఖాస్తును రిజర్వులో పెట్టారు. సీబీఐ ఛార్జీ షీటు నెల రోజుల లోపల దాఖలు చేయనందున బెయిల్ ఇవ్వాలని నిందితుడి తరపు న్యాయవాది దరఖాస్తును కోర్టు ముందు ఉంచారు.
అయితే, నిందితుడు బెయిల్పై విడుదలైతే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ కోరింది. దీంతో కోర్టు సీబీఐ వాదనకు అంగీకరించి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
కాగా, నిందితుడి తరపు న్యాయవాది మరో రెండు బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేశారు. నిందితుడి ఫింగర్ ప్రింట్స్ తీసుకునేందుకు సీబీఐకి జువైనల్ జస్టీస్ బోర్డ్ అనుమతివ్వడాన్ని వారు వ్యతిరేకించారు. నవంబర్ 8-11వరకు నిందితుడిని సీబీఐ కస్టడీకి తీసుకోవడాన్ని వారు సవాల్ చేశారు. కాగా, ఈ అప్పీల్ను జనవరి 22న కోర్టు విచారించనుంది.