అయ్యప్ప దర్శనానికి సర్వం సిద్ధం: కొత్త నిబంధనలు ఇవే: 60 ఏళ్లు దాటితే: పంపాలో స్నానంపై
తిరువనంతపురం: పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయ తలుపులు తెరచుకోబోతున్నాయి. రెండు నెలల పాటు కొనసాగే మండలం-మకరవిళక్కు దర్శనాల కోసం కేరళ ప్రభుత్వం ఏర్పాటన్నీ పూర్తి చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా సరికొత్త నిబంధనలను అమలు చేయబోతోంది. సోమవారం నుంచి మణికంఠుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సారి అయ్యప్ప స్వామి దర్శనం లభించకపోవచ్చంటూ మొదట్లో వార్తలు వచ్చాయి.
Recommended Video
పరిమితంగా భక్తులకు అనుమతి..
అన్లాక్లో భాగంగా దేశంలోని అన్ని ఆలయాలను తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులు ఒకేచోట గుమికూడ ఉండనివ్వకుండా ఏర్పాట్లను చేశారు. భక్తుల కోసం ఆలయవర్చువల్ క్యూ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇంతకుముందులా లక్షలాది మంది భక్తులకు అయ్యప్పుడి దర్శనానికి అనుమతి ఇవ్వట్లేదు. భక్తుల సంఖ్యను పరిమితం చేశారు. రోజూ వెయ్యిమంది భక్తులకు అనుమతి ఇస్తారు. శని, ఆదివారాల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేశారు. రెండు వేల మందికి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు.
నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి..
ప్రతి భక్తుడూ కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయినప్పటికీ- తిరువనంతపురం, తిరువళ్లా, చెంగన్నూర్, కొట్టాయం రైల్వేస్టేషన్ల వద్ద కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అధికారులు ఆయా చోట్ల యాంటీజెన్ టెస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు కనిపిస్తే.. దర్శనానికి అనుమతి ఇవ్వరు. వారిని కోవిడ్ సెంటర్లకు పంపిస్తామని కేరళ దేవస్వొం మంత్రి కడగంపల్లి సురేంద్రన్ వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా క్వారంటైన్లో గడపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
60 ఏళ్లు దాటితే..
ఆలయానికి ఎంట్రీ పాయింట్గా భావించే నీలక్కల్ వద్ద భక్తులకు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తారు. 60 ఏళ్లకు పైగా వయస్సున్న వారు ఫిట్నెస్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే- పదేళ్ల లోపు పిల్లలకు ఆలయంలోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు, కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న భక్తులు శబరిమలకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాంటి వారు వచ్చినా, ఆలయంలో ప్రవేశాన్ని కల్పించబోమని స్పష్టం చేశారు.
పంపాలో స్నానం.. నిషేధం..
దర్శనానికి వచ్చే భక్తులు తమ వివరాలను ముందుగానే అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. దీనికోసం వారు తమ వివరాలను కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. పంపా నదిలో స్నానం చేయడానికి అనుమతి లేదు. సన్నిధానం, గణపతి ఆలయం సమీపంలో బస చేయడం కూడా నిషేధించారు. శబరి గిరీశుడి దర్శనం అనంతరం భక్తులు వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.