Sabarimala Good news:ఇంటికే స్వామివారి ప్రసాదం డెలివరీ.. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలంటే..?
శబరిమల: ప్రతి ఏటాలా కాకుండా ఈ సారి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులపై ఎన్నో ఆంక్షలున్నాయి. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శబరిమల ఆలయంను దర్శించుకోవాలనుకునే భక్తుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. ఏటా నవంబర్ మాసం వస్తే చాలు... తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా అయ్యప్ప స్వామి భక్తులు కనిపిస్తారు. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్కడక్కడ మాత్రమే నల్లటి వస్త్రాలు ధరించిన భక్తులు కనిపిస్తున్నారు.
దీంతో అయ్యప్ప భక్తులపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపిందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక కరోనా కారణంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోలేకపోతున్న భక్తులకు స్వామివారి ఆలయ బోర్డు గుడ్ న్యూస్ తెలిపింది. అయ్యప్ప స్వామి ప్రసాదం నేరుగా పొందలేని వారికి... భారత పోస్టల్ సర్వీసు ద్వారా తమ ప్రాంతాలకు చేరవేస్తామంటూ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ప్రసాదం పొందాలనుకునే భక్తులు ఏం చేయాలి...?
అయ్యప్ప స్వామి ప్రసాదం డోర్ డెలివరీ
కరోనా కష్టకాలంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోలేకపోతున్న వారికి ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. సాధారణంగా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని ఆపై ప్రసాదం పొందుతారు. కానీ ఈ సారి కరోనాకారణంగా చాలామంది భక్తులు శబరిమలకు వెళ్లడం లేదు. దీంతో ఆలయానికి కూడా రెవిన్యూ భారీగా పడిపోయింది. అయితే కొంతలో కొంతైనా ఆదాయం పొందాలనే ఆలోచనతో ప్రసాదంను డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించింది. అయ్యప్ప స్వామి ప్రసాదంను డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్ సేవలను వినియోగించుకోనున్నట్లు ట్రావన్కోర్ దేవస్వామ్ బోర్డు ప్రకటించింది. స్పీడ్ పోస్టు ద్వారా డెలివరీ చేస్తామని స్పష్టం చేసింది.
ఈ ప్రసాదం పొందాలంటే భక్తులు ఎక్కడ ఎలా బుక్ చేసుకోవాలి..?
అయ్యప్పస్వామి ప్రసాదం పొందాలనుకునే భక్తులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్వామి వారి ప్రసాదంలో భాగంగా ఒక ప్యాకెట్ అరవానా, నెయ్యి, పసుపు, కుంకుమ, విభూతి, అర్చన ప్రసాదం ఉంటుంది. ఈ ఐటెమ్స్ అన్నీ చక్కగా ఒక కార్టన్ బాక్స్లో ప్యాక్ చేస్తారు. ఈ కిట్ మొత్తం రూ.450గా నిర్ణయించారు. ఇక ప్రసాదం పొందాలనుకునే భక్తులు తమ ప్రాంతంలోని పోస్టాఫీసులకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఆన్లైన్ ద్వారా రూ.450 చెల్లించాలి.
Recommended Video
ఒక్క రసీదు కింద ఎన్ని ప్యాకెట్లు
ఒక రసీదు కింద 10 ప్యాకెట్లు మాత్రమే తీసుకోవచ్చని ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఎన్ని బుకింగ్స్ అయినా చేసుకోవచ్చని దీనిపై ఎలాంటి పరిమితి లేదని వెల్లడించింది. ప్రస్తుతం కోవిడ్-19 కారణంగా పరిమితి సంఖ్యలో మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు శబరిమల ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు 1000 మందిని అనుమతిస్తుండగా... వారాంతంలో ఆ సంఖ్యను 2వేలుగా చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భారత తపాలా శాఖ, మరియు ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డులు ఒకే తాటిపైకొచ్చి దర్శనం చేసుకోలేకపోతున్న భక్తులకు నేరుగా ఇంటికే స్వామివారి ప్రసాదంను చేరవేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాయి.