శబరిమలలో మహిళల ప్రవేశం: సుప్రీం ఏడు ప్రశ్నలు: హిందూ అంటే అర్థమేంటీ?
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశం కల్పించే అంశాన్ని పరిష్కరించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఏడు ప్రశ్నలను రూపొందించింది. అయ్యప్ప స్వామి సన్నిధిలోనికి మహిళలకు ప్రవేశం కల్పించాలా? వద్దా? అనే విషయంపై తొమ్మిది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఏడు ప్రశ్నలకు లోబడే విచారణ కొనసాగించాల్సి ఉంటుంది.
నిందితులకు ముందస్తు బెయిల్ ఛాన్స్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టం యధాతథం
ఆలయాలే కాదు.. మసీదులను కూడా..
శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటీషన్లపై విచారణను తొమ్మిది న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. మహిళలకు ప్రవేశం కల్పించాల్సిన అంశాన్ని ఒక్క హిందు ఆలయాలకు మాత్రమే పరిమితం చేయాల్సి ఉండదని, మసీదులను కూడా ఈ పిటీషన్ల పరిధిలోకి చేర్చాల్సి ఉంటుందంటూ ఇదివరకే సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనానికి..
అత్యంత సున్నితమైన, మతపరమైన, కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న పిటీషన్లు కావడం వల్ల దీన్ని విస్తృత ధర్మాసనం సమక్షానికి పంపించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ మోహన్ ఎం శంతన గౌడర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ నిర్వహిస్తుంది.
వారంలో అయిదురోజుల పాటు..
శబరిమల ఆలయంలోనికి మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 69 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయి. దీనిపై గత ఏడాదే తుది తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల విస్తృత స్థాయి ధర్మాసనానికి బదలాయించారు. ఈ రివ్యూ పిటీషన్లను విచారించడానికి ఇప్పటిదాకా ఎలాంటి న్యాయపరమైన మార్గదర్శకాలు లేవు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. తాజాగా ఏడు ప్రశ్నలకు రూపొందించింది. వాటికి లోబడే విచారణ కొనసాగించాల్సి ఉంటుంది.
ఆ ఏడు ప్రశ్నలు ఇవే..
1. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం..మతపరమైన స్వేచ్ఛను పొందడానికి హద్దులేమైనా ఉన్నాయా?, 2. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించి మత స్వేచ్ఛను హక్కుగా భావించవచ్చా?, 3. మతపరమైన స్వేచ్ఛ, హక్కులను రాజ్యంగంలోని ఆర్టికల్ 26 పార్ట్ 3 కింద పబ్లిక్ ఆర్డర్, నైతికత, ఆరోగ్యపరమైన అంశంగా పరిగణించవచ్చా?, 4. నైతికత అనే పదానికి సరైన అర్థం, రాజ్యంగ నైతికత ద్వారా మతపరమైన స్వేచ్ఛను పొందే వీలు ఉందా? 5. ఆర్టికల్ 25 ప్రకారం.. మత పరమైన అంశాలను న్యాయపరంగా సమీక్షించే అవకాశం ఉందా? 6. రాజ్యంగంలోని ఆర్టికల్ 25 (2) ప్రకారం.. సెక్షన్ ఆఫ్ హిందూస్ అనే పదానికి అర్థమేంటీ?, 7. మతాన్ని విశ్వసించని వ్యక్తులెవరైనా గానీ మత పరమైన అంశాలపై పిల్ దాఖలు చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలను రూపొందించింది సుప్రీంకోర్టు.