Sabarimala:బోసిపోయిన ఎరుమెలి పట్టణం... ఒకప్పుడు 25వేలు, ఇప్పుడు 700 భక్తులు మాత్రమే..!
శబరిమల: శబరిమల సీజన్ ప్రారంభమైందంటే చాలు అక్కడి పరిసరాలన్నీ కిటకిటలాడుతాయి. ఎప్పుడూ వినిపించే డప్పుల మోత, అటు ఇటూ రోడ్డుపై పరుగులు తీసే అలంకరించబడిన వాహనాలు, కళకళలాడే దుకాణాలు ఇవన్నీ ఈసారి కనిపించడం లేదు. అసలు ఇది శబరిమలేనా అని అనిపించేలా అక్కడి పరిసరాలు తయారయ్యాయి. ఇందుకు కారణం కరోనావైరస్ మహమ్మారి. ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఎన్నో ఆంక్షల మధ్య ఈ సారి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. ఇక కొండ కింద ముఖ్యమైన ప్రాంతం ఎరుమెలి. ఈ సారి కరోనాకారణంగా ఈ ప్రాంతం వెలవెలబోయింది.
ఇక కొండపైకి వెళ్లేందుకు తొలి ప్రాంతం ఎరుమెలి. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే ఈ ప్రాంతం ఈ సారి బోసిపోయింది. తొలివారంలో కేవలం 700 మంది మాత్రమే భక్తులు దర్శనం కోసం వచ్చారు. ఈ పట్టణం గుండా సాధారణ రోజుల్లో రోజుకు 25వేలకు పైగా భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ కరోనా కారణంగా ఈ సారి భక్తుల రాకపోకల్లో భారీ వ్యత్యాసం నెలకొంది. అటవీమార్గం మూసివేయడం, రోజువారీ భక్తుల సంఖ్యపై పరిమితి విధించడం, నిలక్కల్కు చేరుకోవడానికి 24 గంటల ముందు కరోనావైరస్ నెగిటివ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉండటంతో ఈ సారి భక్తులు ఎరుమెల్లి ప్రాంతంను దాటుకుని నేరుగా కొండపైకి చేరే మార్గాలను అన్వేషిస్తున్నారు. దీంతో ఎరుమెల్లి ప్రాంతంలో భక్తుల తాకిడి భారీగా తగ్గింది.
సాధారణ రోజుల్లో భక్తి పరవశంతో అయ్యప్ప స్వామి ఆలయం మునిగిపోతుంది. ఇక స్థానికంగా జరిగే వ్యాపారంపై కూడా కరోనా మహమ్మారి ప్రభావం భారీగా పడింది. వ్యాపారాలు లేక వ్యాపారస్తులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా దుకాణాలు, రెస్టారెంట్లు, పార్కింగ్ గ్రౌండ్లు, టాయ్లెట్ కాంప్లెక్సులు కరోనా కారణంగా మూతపడ్డాయి. దీంతో రెండు నెలల పాటు జరిగే వ్యాపారంకు గండిపడింది. సాధారణ రోజుల్లో 74 వస్తువులుగల దుకాణాలకు వేలంపాట నిర్వహిస్తే రూ.3 కోట్లు రెవిన్యూ వచ్చేది.
Recommended Video
ఈ సారి ఆంక్షలు ఉండటంతో 15దుకాణాలు మాత్రమే లీజుకు ఇవ్వడంతో కనీసం రూ.10 లక్షలు కూడా దేవొసం బోర్డుకు రాలేదు. ఇక వేలం పాటలో అనుకున్న లక్ష్యాన్ని చేరకపోవడంతో తామే పార్కింగ్ స్థలాలు, టాయ్లెట్ కాంప్లెక్స్లు, కొబ్బరికాయలు, డ్రమ్ సెట్లు సాధారణ ధరకు ఇచ్చామని బోర్డు అధికారులు తెలిపారు. ఇక కొన్ని దుకాణాలు అయితే లాభం కోసం కాకుండా అయ్యప్ప స్వామికోసమే ఏర్పాటు చేయడం జరిగిందని టీడీబీ డిప్యూటీ కమిషనర్ కృష్ణకుమార్ వారియర్ చెప్పారు.