కేరళ సర్కార్ కఠిన ఆంక్షలతో..హుబ్లీ అయ్యప్ప స్వామి ఆలయంకు భక్తుల తాకిడి
హుబ్లీ: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంను దర్శించుకునేందుకు కేరళ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడంతో చాలామంది భక్తులు ఈ సారి శబరిమలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఒకవేళ అక్కడికి వెళ్లినా కేరళ ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ గైడ్లైన్స్లో ఏదో ఒకటి సమర్పించకపోవడంతో భక్తులను స్వామివారి దర్శనం కోసం అనుమతించడం లేదు. ఈ వార్త వ్యాపించడంతో కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు శబరిమలకు వెళ్లకుండా ఇందుకు ప్రత్యామ్నాయ అయ్యప్ప స్వామి ఆలయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే కర్నాటకలోని హుబ్లీలోని శిరూర్ పార్క్కు భక్తులు క్యూ కడుతున్నారు. ఇక్కడ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఎలా ఉంటుందో అలాంటి ఆలయమే ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తుండటంతో కొంత కళ సంతరించుకుంది.
గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి హుబ్లీ అయ్యప్ప స్వామి ఆలయంకు భక్తుల తాకిడి ఎ్కకువగా ఉందని చెప్పారు శ్రీ అయ్యప్ప భక్తవృందా ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ వీఎస్వీ ప్రసాద్ చెప్పారు. ఇక భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ యాజమాన్యం చెప్పింది. ఇక హుబ్లీలోని అయ్యప్ప స్వామి ఆలయం అచ్చు కేరళలోని శబరిమల ఆలయంలానే నిర్మించినట్లు చెప్పారు. శబరిమల ఆలయంలో 18 మెట్లు ఎలాగుంటాయో ఇక్కడ కూడా అదే 18 మెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఆలయ ధర్మాధికారి ఆనంద్ గురుస్వామి.
కర్నాటకలో శబరిమల ఆలయంతో పోలిఉన్న ఆలయాలు నాలుగు ఉన్నాయని చెప్పారు. హుబ్లీ, బళ్లారి, చిత్రదుర్గ, నంజన్ గోడ్లలో ఇవి ఉన్నాయి. గతంలో ఈ ఆలయాన్ని రోజుకు 300 నుంచి 400 మంది దర్శించుకునేవారని అయితే ఈ సారి ఆ సంఖ్య పెరిగిందని ఓ భక్తుడు చెప్పాడు. హుబ్లీ అయ్యప్ప ఆలయం చాలా బాగుందని చెప్పారు మహారాష్ట్ర దాంబివ్లీ నుంచి వచ్చిన భక్తుడు చెప్పాడు.