శబరిమల కేసు: రివ్యూ పిటిషన్లను జనవరి 22 నుంచి విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు
శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును మంగళవారం విచారణ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు పునఃసమీక్షపై వేసిన పిటిషన్లను జనవరి 22న విచారణ చేస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అదికూడా బహిరంగ కోర్టులో విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే ముందు ఇచ్చిన తీర్పుపై ఎలాంటి స్టే ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కొన్ని శతాబ్దాల నుంచి శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఇక్కడ నలుగురు జడ్జీలు ఒకే రకమైన తీర్పు ఇవ్వగా ఒక్క మహిళా జడ్జి మాత్రం మహిళలకు ప్రవేశం కల్పించరాదని తీర్పు చెప్పారు. మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించకపోవడమంటే రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని విస్మరించడమే అంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది. సుప్రీం ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. తీర్పును పునఃపరిశీలించాలంటూ 46 రోజుల్లో 50 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
అయ్యప్ప స్వామి భక్తులు సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అక్కడికి వచ్చే మహిళా భక్తులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతేకాదు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారన్న నెపంతో ప్రధాన అర్చకుడు పూజలు చేయడం కూడా నిలిపివేశారు. మరోవైపు నమ్మకం, విశ్వాసం అనేది శాస్త్రీయంగా నిర్ధారించలేమంటూ తెలుపుతూ పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్లు. అయితే మహిళలపై నిషేధం శారీరక అంశాలను దృష్టిలో ఉంచుకుని విధించలేదని..కేవలం అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కనుకే నిషేధం విధించడం జరిగిందని పిటిషనర్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు బహిరంగ కోర్టులో ఓ కేసును సుప్రీంకోర్టు విచారణ చేసిన దాఖలాలు లేవు. కోర్టు రివ్యూ పిటిషన్లు విచారణకు తీసుకుంటుందని చెప్పగానే అర్చకులు ఆనందం వ్యక్తం చేశారు.