అలా చేస్తేనే: ప్రభుత్వం ఆఫర్, ముఖ్యమంత్రికి శబరిమల పూజాలు షాక్
తిరువనంతపురం: ఇటీవల శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఆలయ ప్రధాన పూజారి, ఇతర పూజారులు, భక్తులు మాత్రం ఇది సరికాదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి పూజారులతో మాట్లాడేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధపడింది.
ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. పూజారులను చర్చలకు పిలిచారు. కానీ వారు ఆయనకు గట్టి షాకిచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాల పైన మాట్లాడేందుకు తాము ముఖ్యమంత్రిని కలుసుకోవాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పుపై మొదట రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, ఆ తర్వాతే ముఖ్యమంత్రితో మాట్లాడుతామని ప్రధాన పూజారి మోహనారు కందారౌ అన్నారు.
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు బెయిల్ మంజూరు, అయినా జైల్లోనే
ప్రభుత్వం ఈ విషయంలో ఏదీ తేల్చనంత వరకు తాము మద్దతివ్వమని, అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తే అందులో యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు, రుతుక్రమం వచ్చే స్త్రీలు కూడా రావొచ్చునని, అలాంటి వాళ్లను అనుమతించడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని, సన్నిధి ఆచారాలు దెబ్బతింటాయని, ఇక శబరిమలలో 600 మంది మహిళా పోలీసులను నియమిస్తామని ప్రకటించారని, ఇవన్నీ ఆలయ సంస్కృతికి భిన్నంగానే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టు తీర్పును విస్తృత చర్చల ద్వారానే ఆచరణలోకి తీసుకురావాలని సీఎం విజయన్ చెప్పినప్పటికీ ఆలయ సీనియర్ పూజారులు ఇందుకు సమ్మతించడం లేదు. సుప్రీం తీర్పు ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని పూజారులు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు విపక్ష కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసింది. కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలపై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. దానికి తగినట్లే ఈ విషయంలోను వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సుప్రీం తీర్పు అమలుపై ప్రజాభిప్రాయం కూడా స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మొదట్లో మరేవిధమైన ఆలోచనా లేకుండానే తీర్పు అమలుకు సిద్ధమని ప్రకటించడంతో ముఖ్యంగా కొట్టాయం, మలప్పురం జిల్లాల్లో పలువురు భక్తుల ఆందోళనలు చేపట్టారు. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులూ చోటుచేసుకున్నాయి. హింసాయుత సంఘటనలూ తలెత్తాయి. తిరువనంతపురంలోని దేవస్థాన మండలి ప్రధాన కార్యాలయం వద్ద శనివారం పలువురు భక్తులు ధర్నాకు దిగారు. భక్తుల దెబ్బకు చర్చలకు ప్రభుత్వం దిగి వచ్చింది. కానీ రివ్యూ పిటిషన్ వేయకుండా ఎలా చర్చిస్తామని పూజారులు, భక్తులు అంటున్నారు.